న్యూఢిల్లీ : దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఇంటర్ ఆపరబుల్ ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా రెండు కంపెనీల ఈవీ వినియోగదారులు దేశవ్యాప్తంగా విడా, ఎథర్ గ్రిడ్స్.. రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. ఈ జాయింట్నెట్వర్క్లో 1,900 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు 100 నగరాల్లో ఉన్నాయి. ‘దేశంలో ఈ అతిపెద్ద చార్జింగ్ నెట్వర్క్ కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చార్జింగ్ సదుపాయాలను అందించడానికి చాలా దోహదపడుతుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న చార్జింగ్నెట్వర్క్ ప్రభుత్వం ఆమోదించిన కనెక్టర్-స్టాండర్డ్ను ఉపయోగించుకుంటుంది. తద్వారా ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లు సులువుగా చార్జింగ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా మా ఈవీలకు ఇబ్బందులు ఉండవు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఎమర్జింగ్ మొబిలిటీ) స్వదేశ్ శ్రీవాస్తవ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ను రూపొందించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఏసీ, డీసీ కంబైన్డ్ చార్జింగ్ కనెక్టర్.