‘స్పై’ ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా: హీరో నిఖిల్

‘స్పై’ ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా: హీరో నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ ‘స్పై జోనర్ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. అయితే ‘స్పై’ ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌‌లో ఉన్నాయి. ‘కార్తికేయ 2’తో ఒక ట్రెండ్ సెట్ చేసిన నిఖిల్.. ఈ చిత్రంతో తర్వాతి స్థాయికి వెళ్తారని నమ్ముతున్నా’ అన్నాడు. 

నిఖిల్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు ఊహించినదాని కంటే గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. గర్వపడే సినిమా చేశాం.అందరూ అద్భుతంగా నటించారు. ప్రతి ఇండియన్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులు పిల్లలకి చూపించాల్సిన  సినిమా.  నా కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అన్నాడు. ‘ఓ మంచి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది’ అని హీరోయిన్స్ ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ అన్నారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిఖిల్, నిర్మాతలకు కృతజ్ఞతలు. టీమ్ అందరి కష్టం వల్లే ఇంత త్వరగా సినిమాని పూర్తి చేయగలిగాం’ అన్నాడు. ‘ఈ కథ నేను ఊహించిన దాని కంటే అద్భుతంగా వచ్చింది.  ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు నిర్మాత రాజశేఖర్. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు జిష్షు సేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, డీవోపీ వంశీ పచ్చిపులుసు తదితరులు పాల్గొన్నారు.