ఈ డ్రైవర్, కండక్టర్ ఎంత మంచోళ్లో.. వీళ్లే గానీ లేకపోతే ఒక ఆడ పిల్ల పెండ్లి ఆగిపోయేది..!

ఈ డ్రైవర్, కండక్టర్ ఎంత మంచోళ్లో.. వీళ్లే గానీ లేకపోతే ఒక ఆడ పిల్ల పెండ్లి ఆగిపోయేది..!

సిద్ధిపేట జిల్లా: భువనగిరి నుంచి జగదేవ్ పూర్ వస్తున్న TG 36 Z 0027 ఆర్టీసీ బస్సులో ఒక పెద్దాయన బ్యాగ్ మర్చిపోయాడు. ఆ బ్యాగులో డబ్బు, బంగారం ఉంది. కన్న కూతురి పెండ్లి కోసం ఆ పెద్దాయన ఇంటికి తీసుకెళుతున్న బ్యాగ్ అది. కూతురు వివాహం కోసం బ్యాగులో 7 తులాల బంగారం, 2.5 లక్షల రూపాయలను యాదగిరి వెంట తీసుకెళుతున్నాడు. బ్యాగును మర్చిపోయి జగదేవ్ పూర్ బస్టాండ్లో దిగి వెళ్లిపోయాడు. యాదగిరితో పాటు ప్రయాణికులంతా దిగి వెళ్లిపోయిన తర్వాత బస్ డ్రైవర్, కండక్టర్ ఆ బస్సులో ఉన్న యాదగిరి బ్యాగును గమనించారు.

పాపం.. ప్రయాణికుల్లో ఎవరో బ్యాగ్ మర్చిపోయారని భావించి ఆ బ్యాగులో డబ్బు, బంగారం ఉన్నా కూడా నిజాయతీగా పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం వివరించారు. ఆ బ్యాగ్ గురించి పోలీసులు ఆరా తీయగా.. యాదగిరి బ్యాగ్ అని తెలిసింది. జగదేవ్ పూర్ ఎస్సై చంద్రమోహన్ బాధితుడికి ఫోన్ చేసి, బస్లో బ్యాగ్ మర్చిపోయావని.. తీసుకెళ్లడానికి పోలీస్ స్టేషన్కు రావాలని సమాచారం ఇచ్చాడు.

బ్యాగు పోయిందని.. కూతురి పెళ్లి కోసం అప్పోసొప్పో చేసి ఇంటికి తీసుకెళుతున్న డబ్బు, బంగారం పోయిందని లబోదిబోమంటున్న యాదగిరికి ఎస్సై చెప్పిన విషయం విని ప్రాణం లేచొచ్చినట్టయింది. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్ కలిసి జగదేవ్ పూర్ ఎస్సై చంద్రమోహన్ ఆ బ్యాగును యాదగిరికి ఇచ్చాడు. బంగారం, డబ్బు లెక్క చూసుకుని ఆర్టీసీ సిబ్బందికి, ఎస్సైకి యాదగిరి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ డబ్బు, బంగారం పోయి ఉంటే తన కూతురి పెళ్లి ఆగిపోయి ఉండేదని, ఇప్పుడు సంతోషంగా తన కూతురి పెళ్లి జరిపిస్తానని యాదగిరి చెప్పాడు.