
తొలిచిత్రం ‘అర్జున్ రెడ్డి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది షాలినీ పాండే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా హీరోయిన్గా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఓటీటీలో విడుదలైన ‘మహారాజ్’ చిత్రం... ఆమెకు తిరిగి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 1860 నేపథ్యంలో ‘చరణ సేవ’ పేరుతో ఓ స్వామిజీ ఆడవాళ్లను ఎలా వశపరుచుకున్నాడు.. దానిని ఎదిరించిన ఓ అభ్యుదయ జర్నలిస్ట్ పోరాటం ఏమైంది అనేది ప్రధాన కథ. సిద్ధార్థ్ మల్హోత్రా డైరెక్ట్ చేశాడు. ‘పాతాళ్ లోక్’ ఫేమ్ జై దీప్ అహ్లావత్ ‘మహారాజ్’గా టైటిల్ రోల్ చేశాడు. ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.
అతని పాత్ర పేరు కర్సన్. తనకు మరదలిగా కిషోరీ పాత్రలో షాలినీ నటించింది. ఇందులో స్వామిజీతో ఆమెకు ఓ ఇంటిమేట్ సీన్ ఉంది. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తను ఎంతగా భయపడిందో ఇటీవల బయటపెట్టింది షాలినీ. మూసేసిన గదిలో ఆ సీన్ తీస్తుండడంతో భయపడి బయటకి వెళ్లిపోయానని, కాస్త గాలి పీల్చుకోవాలి, కొంత సమయం కావాలని డైరెక్టర్ను అడిగానని చెప్పిందామె. వాళ్లు కూడా తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఆమె చెప్పింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తమ మనోభావాలను కించపరిచేలా ఉందని ఓ హిందూ సంఘం కోర్టును ఆశ్రయించగా.. మొదట స్టే ఇచ్చిన గుజరాత్ కోర్టు ఆ తర్వాత రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.