
రియల్ లైఫ్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేదని, ‘తమ్ముడు’ సినిమాతో అది నెరవేరిందని చెప్పింది వర్ష బొల్లమ్మ. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ చెప్పిన విశేషాలు.
‘‘ఈ చిత్రంలో చాలెంజింగ్ క్యారెక్ట్ చేశా. నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ‘బిగిల్’ మూవీ తర్వాత అంతగా కష్టపడిన చిత్రమిది. ఇందులో నేను చిత్ర అనే పవర్ఫుల్ ఉమెన్గా కనిపిస్తా. హీరో నితిన్ క్యారెక్టర్ జైకు డ్రైవింగ్ ఫోర్స్లా నా పాత్ర ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. నా క్యారెక్టర్కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. కొన్ని సినిమాలు థియేటర్స్లోనే ఎక్స్పీరియెన్స్ చేయాలి. అలాంటి సినిమా ఇది. విజువల్ ట్రీట్లా ఉంటుంది. మంచి సౌండింగ్తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో లయ గారు మరో కీ రోల్ చేస్తున్నారు. ఆమె జర్నీ మా అందరికీ ఇన్సిపిరేషన్. హీరోయిన్గా ఒక కెరీర్ చూసిన ఆమె పర్సనల్ లైఫ్లోకి వెళ్లడం, మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆమె కెరీర్లో జరిగిన విశేషాలు మాతో షేర్ చేసుకునే వారు. ఈ మూవీని ఏదైనా స్టూడియోలో ఉన్న చిన్న అడవిలో కూడా షూట్ చేయొచ్చు. కానీ సహజంగా ఉండేలా మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించాం. అది దట్టమైన అడవి. వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్లో కేవలం కాగడాలు పట్టుకుని నటించాం. లయ గారు అయితే చెప్పులు లేకుండా నటించారు. అయినా ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొనేవారు. ‘జాను’ తర్వాత దిల్ రాజు గారి బ్యానర్లో నటించడం హ్యాపీగా ఉంది. - ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా. నిత్యామీనన్లా మంచి పెర్ఫార్మర్ అని పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా”.