కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు

కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘హిడింబ’. నందితా శ్వేత హీరోయిన్. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు మూవీ టీమ్ శనివారం ప్రెస్‌‌మీట్ నిర్వహించింది.  అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో,  ఇది సాధ్యపడుతుందా  అని అనుకున్నాం. కానీ కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ఈ సినిమా విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి. బిజినెస్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా  ఉన్నారు. ఈ వర్షంలో కూడా అందరూ థియేటర్స్‌‌కి వచ్చి సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పడం ఆనందంగా ఉంది’ అన్నాడు. ‘సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇది నాకు ఎమోషనల్‌‌గా చాలా కనెక్ట్ అవుతుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది’ అంది నందిత. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ‘గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐతే ఈ వర్షాలని తట్టుకొని మొన్న సెకెండ్ షో నుంచి మెల్లగా గ్రోత్ మొదలైయింది. రెండు రోజులకి మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా  ఉంది’ అని చెప్పాడు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు నిర్మాత శ్రీధర్. నటులు మకరంద్ దేశ్ పాండే, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.