
- బార్ అసోసియేషన్ తీర్మానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న సిఫారసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ మంగళవారం తీర్మానించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేందర్, జస్టిస్ పి. శ్రీసుధలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సిఫారసులు చేయడంతో మంగళవారం అత్యవసర సమావేశానికి బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ పిలుపునిచ్చింది.
బదిలీలతో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేయడంలేదని, తెలంగాణ న్యాయమూర్తుల బదిలీల సిఫారసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలని అసోసియేషన్ తీర్మానించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మెంబర్స్ పెద్దఎత్తున పాల్గొని న్యాయమూర్తుల బదిలీపై నిరసన వ్యక్తం చేశారు.