- హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారంలో సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ దాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నంబర్.124, 125ల్లో సంధ్య హోటల్స్కు చెందిన ప్లాట్లు, నిర్మాణాల్లో హైడ్రా జోక్యం చేసుకోరాదంటూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా తమ నిర్మాణాలను ఈనెల 6న హైడ్రా అక్రమంగా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సంధ్య కన్స్ట్రక్షన్స్) హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.
వాటిపై వేసవి సెలవుల కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిందన్నారు. యూఎన్ఓఎస్, మ్యాంగో పేర్లతో ఉన్న 53 నుంచి 63 వరకు ప్లాట్లు, నిర్మాణాల్లో జోక్యం చేసుకోకుండా, తమ హక్కులకు భంగం కలిగించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సంధ్య హోటల్స్ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.
