
- సోమవారం వరకు ఆగాలని సూచన
- ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఎన్సీబీ విజిలెన్స్
ముంబై: డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ను అరెస్టు వ్యవహారంలో లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖడేకు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనను ఈ నెల 22 వరకు అరెస్ట్ చేయవద్దని, ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని సీబీఐ అధికారులను బాంబే హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నదని సమీర్ ఈ సందర్భంగా ఆరోపించారు. తనపై రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సమీర్ అడ్వొకేట్, సీబీఐ వాదనలు విన్న బెంచ్ సోమవారం వరకు చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
సమీర్కు ముంబైలో నాలుగు ఫ్లాట్లు, రోలెక్స్ వాచీ
సమీర్ వాంఖడే ఇన్వెస్టిగేషన్ రిపోర్టును నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విజిలెన్స్ అధికారులు శుక్రవారం రిలీజ్ చేశారు. సమీర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. సమీర్ పేరు మీద ముంబైలో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్తో పాటు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో యాడ్ చేసినట్లు వివరించారు. కొందరు అనుమానితుల పేర్లను తొలగించినట్లు వెల్లడించారు.
ఆరు సార్లు ఫారిన్ ట్రిప్స్
సమీర్ వాంఖడే 2017 నుంచి 2021 వరకు ఆరు సార్లు ఫారిన్ వెళ్లినట్లు ఎన్సీబీ విజిలెన్స్ అధికారులు రిపోర్టులో తెలిపారు. బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్, సౌతాఫ్రికా, మాల్దీవులకు వెళ్లినట్లు వివరించారు. 55 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దీని కోసం రూ8.75 లక్షలు ఖర్చు చేసినట్లు సమీర్ వివరించారని తెలిపారు. ఇవి ఫ్లైట్ టికెట్ ఖర్చుకే సరిపోతాయని అధికారులు పేర్కొన్నారు. 22 లక్షల ఖరీదైన రోలెక్స్ వాచీని రూ.17 లక్షలకు కొన్నట్లు తెలిపారు. వాషీమ్లో 41 ఎకరాల భూమి ఉన్నట్లు వివరించారు. గోరెగావ్లో రూ.2.45 కోట్ల విలువైన ఐదో ఫ్లాట్ కోసం రూ.82.8 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పెండ్లికి ముందు భార్యతో కలిసి రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్ కొన్నట్లు తెలిపారు. సమీర్, అతని భార్య తమ వార్షిక ఆదాయం రూ.45,61,460గా చూపించారని, కానీ, ఫారిన్ ట్రిప్స్, ఆస్తులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ట్యాక్స్ రిటర్స్న్లో వివరించలేదని పేర్కొన్నారు.