నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పనులకు బ్రేక్ పడింది. పరిహారం చెల్లించకుండా తన భూమి తీసుకున్నారని కొక్కనూరి మధు అనే దళితుడు హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉయ్యాలవాడ సమీపంలోని సర్వే నెం.237లో దళితులకు సంబంధించిన 77 ఎకరాల అసైన్డ్ పట్టా భూముల్లో నుంచి 40 ఎకరాలు సేకరించిన అధికారులు.. 33 ఎకరాలు కాలేజీకి కేటాయించారు.
అయితే భూసేకరణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల మీదుగా జరగడంతో వివాదం నెలకొంది. వాళ్లే బాధితులతో ఫారం 6 మీద సంతకాలు పెట్టించి.. గవర్నమెంట్కు సరెండర్ చేయించారు. నిరుడు అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) చాంబర్లో సంతకాల ప్రక్రియ ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించారు. కాగా, రెవెన్యూ అధికారులు చట్టాలను విస్మరించి.. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేయడంపై రైతు మధు కోర్టుకు వెళ్లాడు.