
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లేవారు తమ వివరాలను జనరల్ డైరీలో నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రజలు (కక్షిదారులు) తేదీ, సమయం ఇతర వివరాలన్నీ ఆ డైరీలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. ఏ పని మీద ఆఫీసుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు లాంటి వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం వల్ల రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్న అధికారులకు చెక్ పడుతుందని అభిప్రాయపడింది.
ఈ సమస్య పరిష్కారానికి జనరల్ డైరీ అవసరమని పేర్కొంది. రిజిస్ట్రేషన్ సమయంలో వస్తున్న అవాంతరాలను తగ్గించేందుకు అధికారులు, ప్రజలకు హైకోర్టు పలు కీలక గైడ్లైన్స్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఇన్ స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకు చేరేలా చూడాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్కు చెందిన అనంత రామేశ్వరిదేవితో పాటు మరికొందరు వేర్వేరుగా24 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ పూర్తిచేసి ఇటీవల తీర్పు చెప్పారు. ఒకరిద్దరు అధికారులు కాదు.. అసలు రెవెన్యూ వ్యవస్థలోనే లోపాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కోర్టులో విచారణ ముగిసినా.. మళ్లీ ఆదేశాలు జారీచేయాలని కోరడంపై ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాళ్లు కొద్దోగొప్పో భూమి కొనుగోలు చేద్దామనుకుంటే రిజిస్ట్రేషన్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు బాధితులకు కోర్టు ఫీజులు అదనంగా మారాయని తెలిపారు. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకున్నా పిటిషనర్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్పై అసంతప్తి వ్యక్తం చేశారు.
ఆఫీసర్లకు గైడ్లైన్స్..
ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రజలు సంప్రదించినప్పుడు అన్నీ చట్టప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయాలి. లేనిపక్షంలో తిరస్కరించాలి. ఇదే విషయాన్ని వారికి తెలియాజేయాలి. తిరస్కరణ మౌఖికంగా ఉండకూడదు. లిఖితపూర్వక పత్రం ఇవ్వాలి.
ఒకవేళ రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు తిరస్కరిస్తే అప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వాపసు ప్రక్రియను సులభతరం చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించే ముందు ప్రజలు వాపసు విధానాన్ని కూడా తెలుసుకోవాలి.కోర్టు ఆదేశాలు లేనప్పుడు, ఉత్తర్వులను ఎత్తివేసినప్పుడు, అప్పీల్ పెండింగ్ లేనప్పుడు.. మళ్లీ దానిపై న్యాయస్థానం ఆదేశాలు కావాలని ప్రజలను
ఒత్తిడి చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేయాలి. తీర్పు వెల్లడించిన, కొట్టివేసిన పిటిషన్లలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రిజిస్టరింగ్ అథారిటీలు తిరస్కరించకూడదు. వింజమూరి రాజగోపాలచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను రిజిస్టరింగ్ అధికారులు పాటించాలి.
రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సూచనలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్టర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలను నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు, రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని చెప్పి అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది.
రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి.. నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే చట్టప్రకారం ఆ జాబితా నుంచి ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నేరుగా కోర్టును ఆశ్రయించకూడదు.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించిన పత్రాలు ఆ చట్టంలోని నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి.