
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా.. మహిళపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు లేఖ రాసిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ తీరుపై చర్యలు తీసుకోవాలని కోర్టు భావించిందని.. అయితే, సర్వీసు దృష్ట్యా కోర్టు తనను నియంత్రించుకుందని.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్ను మందలించాలని సీఎస్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వి.కవితకు చెందిన ఇంటిని ప్రభుత్వం 2004లో సేకరించి పరిహారం చెల్లించినా నిర్వాసితుల జాబితాలో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు కవితను నిర్వాసితుల జాబితాలో చేర్చి ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించినా అమలు చేయకపోవడంతో ఆమె కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసింది.ఈ పిటిషన్లు రెండు పెండింగ్లో ఉండగానే ఆమెపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఆర్డీవో వేములవాడ తహసీల్దార్కు లేఖ రాశారు.