- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పట్టా ఇచ్చి భూమి చూపకపోవడంతో 20 ఏండ్లుగా నష్టపోయిన బాధిత మహిళకు హైకోర్టులో న్యాయం జరిగింది. భూమి ఇవ్వకుండా బాధితులను ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన ప్రభుత్వ అధికారుల తీరును ధర్మానం తప్పుబట్టింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముంపు బాధితురాలు దాదాపు 20 ఏండ్ల పోరాటానికి న్యాయం చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం కిస్టాపూర్కు చెందిన దంతాల చిన్నక్కకు చెందిన భూమి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిమిత్తం కోల్పోయింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం 2006లో రెండు ఎకరాల భూమికి పట్టా మంజూరు చేసినప్పటికీ, ఆ భూమిని అప్పగించలేదు. దీంతో బాధిత మహిళ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు పట్టా ఉన్నా భూమి ఎక్కడుందో తెలియక సాగు చేసుకోలేకపోతున్నట్లు ఆమె చేసిన వాదనను న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఇటీవల సంచలన తీర్పు వెలువరించారు.
భూమి అందక సాగు చేయలేక 20 ఏండ్లుగా నష్టపోయిన బాధితురాలికి రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా 16 వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పట్టాలో పేర్కొన్న 2 ఎకరాల భూమిని వెంటనే గుర్తించి సరిహద్దులు నిర్ధారించి పాస్బుక్, టైటిల్ డీడ్ను ఆమెకు అందజేయాలని ఆదేశించింది.
