
- సిద్ధిపేట-2 సీఐ ఎం.శ్రీనివాస్ తీరుపై హైకోర్టు ఫైర్
- చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో కౌన్సెలింగ్ పేరిట జోక్యం చేసుకున్న సిద్దిపేట-2 పోలీసులపై హైకోర్టు శుక్రవారం మండిపడింది. సిద్దిపేట-2 సీఐ ఎం.శ్రీనివాస్ తీరుపై విచారణ చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే సర్వీసు రికార్డులో నమోదు చేయాలని స్పష్టం చేసింది. దాంపత్య వివాదంలో కౌన్సెలింగ్ పేరుతో పోలీసు స్టేషన్కు పిలిచి బెదిరింపులకు గురిచేయడంపై జి.సుమన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..జూన్ నుంచి కౌన్సెలింగ్ పేరుతో ప్రతిరోజు పోలీసు స్టేషన్కు హాజరుకావాలని, భార్యతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని బెదిరిస్తున్నారంటూ తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి సీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు