హైదరాబాద్, వెలుగు: ఓ ఇంట్లో రెండేండ్లుగా ఉంటున్నారంటూ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ సర్టిఫికెట్తో ఉపయోగం ఏంటో చెప్పాలని నిలదీసింది. లోకల్ కేటగిరీలో మెడికల్ అడ్మిషన్ల కోసం ఎమ్మార్వోలు జారీ చేస్తున్న రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సరిగ్గా లేవని అసహనం వ్యక్తం చేసింది. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్న వ్యక్తి తెలంగాణకు చెందినవారో.. కాదో.. విచారణ చేసి సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఈ విషయంలో ఎమ్మార్వోలు, అధికారులకు తగిన సూచనలు చేయాలని ఏజీకి సూచించింది. తమిళనాడు, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో చదివి తెలంగాణకు వచ్చిన వారికి లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారని ప్రశ్నించింది.
సర్టిఫికెట్లో ఫలానా చోట రెండేండ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే ఉందని, దీంతో యూనివర్సిటీలు వాటిని ఆమోదించడం లేదని దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్ కుమార్ తో కూడిన బెంచ్ గురువారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనల కారణంగానే తెలంగాణకు చెందినవాళ్లు సీట్లు కోల్పోతున్నారని బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులు ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకటి.. రెండేండ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి లోకల్ కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చిన విషయాన్ని బెంచ్ గుర్తు చేసింది. అధికారులు యూనివర్సిటీ నిబంధనల ఆధారంగా స్థానికతపై స్పష్టత ఇచ్చేలా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది.
నవీన్ మిట్టల్పై ఎంక్వయిరీ త్వరగా చేయండి
ఎన్వోసీ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్ మండలం నానల్నగర్లోని 5,200 చదరపు గజాలకు ఎన్వోసీ ఇచ్చిన అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్పై ఎంక్వయిరీ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 8న విచారణ కమిటీ ఎదుట హాజరుకావాలని పిటిషనర్ శాంతి అగర్వాల్, ఆమె కుమారుడు అతుల్ కుమార్ అగర్వాల్కు తెలిపింది. అలాగే ఆ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించిన ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ కూడా త్వరగా పూర్తి చేయాలని లోయర్ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
శాంతి అగర్వాల్ కొనుగోలు చేసిన స్థలానికి కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారు. వారికి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని ఆఫీసర్ల కమిటీ ఎన్వోసీ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ శాంతి 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి విచారించి ఎన్వోసీ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ వి.వి.దుర్గాదాస్, తహసీల్దార్లు మధుసూదన్రెడ్డి, వెంకట్రెడ్డి ఇతరులపై డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై 2017లో ప్రైవేటు వ్యక్తులు, ఆఫీసర్లు దాఖలు చేసిన అప్పీళ్లను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ఇప్పటికే శాఖాపరంగా నలుగురు సాక్షులను విచారణ చేశామన్నారు. శాంతి అగర్వాల్ను కూడా సెప్టెంబర్ 8న విచారించనున్నట్లు చెప్పారు. ఆరు వారాల్లో విచారణ పూర్తికానుందని పేర్కొన్నారు.