- ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: కౌంటర్లు దాఖలు చేయడానికి ఎంత గడువు కావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ల అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన తేదీని నిర్ణయిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పినా ఆ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు విస్మరిస్తుండటాన్ని తప్పుబట్టింది. తమ సానుకూల ధోరణిని అవకాశంగా తీసుకుని పదే పదే గడువు కోరితే సహించమని, జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వికారాబాద్లోని దామగుండం రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటును సవాలు చేస్తూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటరు దాఖలుకు గడువు ఇవ్వాలని కోరగా బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడాది నుంచి పదే పదే గడువు కోరుతున్నారని, ఇది చివరి అవకాశమని.. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా జీవవైవిధ్యంపై రాడార్ కేంద్రం చూపే ప్రభావంపై అదనపు కౌంటరు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటిపై సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ డిసెంబరు 15కు వాయిదా వేసింది.
