హైదరాబాద్, వెలుగు: సెర్చ్ వారెంట్ల జారీ విధానంపై స్పష్టమైన వివరాలు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు మాత్రమే ఉండే సెర్చ్ వారెంట్ జారీ అధికారాన్ని అసిస్టెంట్ కమిషనర్ హోదాలోని పోలీసు అధికారి ఎలా ఉపయోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది.
హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348 ఫస్లీలోని సెక్షన్ 47 ప్రకారం.. పోలీసులకు సెర్చ్ వారెంట్లు జారీ చేయడం, ఆస్తుల స్వాధీనం, వ్యక్తుల అరెస్టు వంటి న్యాయాధికారాలు కల్పించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ లా స్టూడెంట్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ను 2 వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
