నాగారం భూములకు పాస్‌‌ బుక్కులు ఎట్లిచ్చారు?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

నాగారం భూములకు పాస్‌‌ బుక్కులు ఎట్లిచ్చారు?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెం.194, 195లో భూములు నిషేధిత జాబి తాలో ఉన్నపుడు  పాస్‌‌ పుస్తకాలు ఎలా జారీ అయ్యాయో వివరాలివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదే శాలు జారీ చేసింది. నాగారంలోని దాదాపు 50 ఎకరాల భూదాన్‌‌ భూములను అబ్దుల్‌‌ జావీద్, అర్షియా సుల్తానా, అబ్దుల్‌‌ లతీఫ్‌‌ తదితరుల పేరుతో పాస్‌‌బుక్‌‌లు జారీ చేసిన అప్పటి తహసీల్దార్‌‌ టి.సుబ్రమణ్యంపై చర్యలు తీసుకోవాలని బి.మల్లేశ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ సోమవారం విచారించారు.

 పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..194, 195 సర్వే నెంబర్లలో 700 ఎకరాలను ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారని, 2018 వరకు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. అప్పటివరకు రెవెన్యూ రికార్డుల్లో లేని వ్యక్తుల పేర్లతో అప్పటి తహసీల్దార్‌‌ పట్టాపాస్‌‌ బుక్‌‌లు జారీ చేశారన్నారు.  సర్వే నెం.194లో భూములను పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌‌లు కొనుగోలు చేయడంతో వివాదాస్పదమైందన్నా రు. వాదననలు విన్న జడ్జి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.