సాంఘిక బహిష్కరణపై వివరణ ఇవ్వండి.. నిజామాబాద్​ వీడీసీ చైర్మన్​కు హైకోర్టు ఆదేశాలు

సాంఘిక బహిష్కరణపై వివరణ ఇవ్వండి.. నిజామాబాద్​ వీడీసీ చైర్మన్​కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్​: నిజామాబాద్‌లోని వేల్పూర్‌ మండలం రామన్నపేట గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్‌ పీర్ల సురేష్‌ కుమార్‌ను ఈ నెల 3న కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలోని 300 ముదిరాజ్​ కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధించడంపై గ్రామస్తులు పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్​ బి. విజయ్​సేన్​ రెడ్డి.. సురేశ్​ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ ఇరుపక్షాలు కలిసే ఉన్నామని.. ఎలాంటి గ్రామబహిష్కరణ లేదని గ్రామంలో దండోరా వేయించిన వీడియోని సమర్పిస్తే ఈ హాజరు మినహాయింపుపై ఆలోచిస్తామని విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

ఒక ఆలయ భూమిని దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ప్రయత్నించిన ముదిరాజ్​ కమ్యూనిటీని సామాజిక బహిష్కరణ చేసినట్టుగా వీడీసీ చైర్మన్​పై జాగర్ల గంగ నరసయ్య, మరో నలుగురు గ్రామస్తులు పిటిషన్​ దాఖలు చేశారు. సురేశ్​ చర్య వల్ల ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అందులో వారు పేర్కొన్నారు.