నిర్మల్, వెలుగు: హిల్ట్ పాలసీ వల్ల రూ.లక్షా 29 వేల కోట్ల విలువైన ల్యాండ్ లూటీ స్కామ్ కు ఆస్కారముందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన నిర్మల్ లో మీడియాతో మాట్లాడారు. హిల్ట్ పాలసీ అమలు కాకుండా జోక్యం చేసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దీనిపై మంత్రి శ్రీధర్బాబు డొంకతిరుగుడు ప్రకటనలు చేశారన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిశ్రమల భూములను అగ్గువకు కన్వర్షన్ చేయడం ముమ్మాటికీ ల్యాండ్ లూటీ కిందికే వస్తుందన్నారు.
ఇండస్ట్రీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేవలం రూ.5 వేల కోట్ల నిధుల కోసం పారిశ్రామిక భూముల కన్వర్షన్ విధానానికి తెరలేపడం సరికాదన్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటీ ఎపిసోడ్ కు బీఆర్ ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ తలుపులు తెరిచిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తదితరులున్నారు.
