- ఓఆర్ఆర్ చుట్టూ పది నిర్మిస్తామన్న గత సర్కార్
- బాట సింగారం, మంగళ పల్లితోనే సరిపెట్టిన హెచ్ఎండీఏ
- మిగతా చోట్ల రెండేండ్లుగా ప్రతిపాదనలు పెండింగ్
- సిటీలోకి వస్తున్న హెవీ వెహికల్స్ తో ట్రాఫిక్ కష్టాలు
- కొత్త సర్కార్త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 ట్రక్ లాజిస్టిక్ టెర్మినల్స్ నిర్మాణానికి రెండేండ్ల కిందట అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా అత్యుత్తమ రవాణా వ్యవస్థను రూపొందించి దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని కల్పిస్తామని వెల్లడించింది. ఆ వెంటనే హెచ్ఎండీఏ.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద బాటసింగారం, నాగార్జునసాగర్రోడ్లోని మంగళ్పల్లి వద్ద రెండు ట్రక్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మిలిగిన ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తు
న్నట్టు పేర్కొన్నారు. అయితే... రెండు ట్రక్ టెర్మినల్స్లోనే కార్యకలాపాలు నడుస్తున్నాయి. మిగతా చోట్ల పెండింగ్ లోనే పడ్డాయి.
ఆధునాతన సదుపాయాలతో నిర్మించగా..
బాటసింగారం, మంగళ్పల్లిలో నిర్మించిన ట్రక్ లాజిస్టిక్ పార్కులో ఆధునాతన సదుపాయాలను కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీకి సరుకులు తీసుకొచ్చే వాహనాలు, ఇతర భారీ వాహనాలు సిటీలోకి ప్రవేశించకుండా ట్రక్ టెర్మినల్ పార్కులోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు లాజిస్టిక్ పార్కులను రూ. 55 కోట్లతో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేశారు. ఇందులో గిడ్డంగులు, 500 ట్రక్పార్కింగ్సదుపాయం, 10 వేల మెట్రిక్టన్నుల ఉత్పత్తులను నిల్వచేసేందుకు కోల్డ్స్టోరేజ్సౌకర్యం, డ్రైవర్లకు, రవాణా ఆపరేటర్లకు విశ్రాంతికి డార్మిటరీలు, రెస్టారెంట్స్, ఆఫీసులు, ఇంధనం నింపుకునేందుకు స్టేషన్లు, ప్రైమరీ హెల్త్సెంటర్లు, ఆటోమొబైల్ సేవా కేంద్రాలు వంటివి అందుబాటు లోకి తెచ్చారు. ఇప్పటికే వీటి నిర్మాణంతో ఆయా ప్రాంతాల పరిధిలో ట్రాఫిక్సమస్యలు చాలావరకు తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు.
మరికొన్ని చోట్ల నిర్మాణానికి ప్లాన్
ముందుగా రెండు పార్కులనైతే హెచ్ఎండీఏ నిర్మించింది. వాటి ప్రారంభ సమయంలోనే అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మరో 8 చోట్ల ట్రక్ టెర్మినల్పార్కులను కూడా నిర్మిస్తామని అందుకు హెచ్ఎండీఏ సిద్దమవుతుందని పేర్కొన్నారు. రెండేండ్లుగా హెచ్ఎండీఏ 8 చోట్ల ట్రక్ లాజిస్టిక్పార్కుల నిర్మాణాన్ని ఇంకా ఆచరణలోకి తీసుకురాలేదు.
మంగళ్పల్లిలో 22 ఎకరాల్లో, బాట సింగారంలో 30 ఎకరాల్లో నిర్మాణాలను పూర్తిచేసింది. దీంతో శంషాబాద్, ఘట్కేసర్, పటాన్చెరు, శంకర్ పల్లి, మేడ్చల్తదితర ప్రాంతాల్లోనూ నిర్మించాలని ప్రతిపాదించినట్టు గతంలోనే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ ఇంకా భూసేకరణ, నిధుల కేటాయింపులు జరగలేదని చెప్పారు. ఎన్నికల కారణంగా కొంతకాలంగా పనులకు బ్రేక్పడిందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ట్రక్ పార్కులపై మళ్లీ ప్రకటన చేస్తేనే పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
పార్కుల నిర్మాణం జరిగేనా?
దేశవ్యాప్తంగా సరకుల రవాణాకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో లాజిస్టిక్స్ పార్కులు నిర్మాణాలు అవసరమని హెచ్ఎండీఏ భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్చుట్టూ లేదా హెచ్ఎండీఏ పరిధిలోని భూముల లభ్యత ఆధారంగా ప్రైవేట్, పబ్లిక్భాగస్వామ్యంతో పార్కుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిందన్నారు. సిటీ అంతటా మరిన్ని బస్సులు, రైల్వే, మెట్రో టెర్మినల్స్కు కూడా హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలిపారు.
రెండేండ్లుగా ప్రతిపాదనలపై ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. దీంతో ఓఆర్ఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వాహనాలు సిటీలోకి వస్తుండగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని భూసేకరణ, నిధుల కేటాయింపులు చేస్తే ప్రతిపాదిత ప్రాంతాల్లో కొత్త ట్రాక్లాజిస్టిక్పార్కుల నిర్మాణాలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.