ప్రభుత్వ ఆఫీసులన్నీ పచ్చగా... కార్యాలయాల ప్రాంగణాల్లో గ్రీనరీ కోసం కొత్త అడుగు

ప్రభుత్వ ఆఫీసులన్నీ పచ్చగా... కార్యాలయాల ప్రాంగణాల్లో గ్రీనరీ కోసం కొత్త అడుగు
  • ల్యాండ్​ స్కేప్ గార్డెన్స్, పచ్చదనం  పెంపుకు హెచ్ఎండీఏ నిర్ణయం
  • జూపార్క్​, నిమ్స్​ ఆవరణలో పైలట్​ ప్రాజెక్టు 

హైదరాబాద్​సిటీ,వెలుగు:  గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో గ్రీనరీని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్లు రూపొందించింది. గ్రేటర్​పరిధిలో  పచ్చదనం తగ్గిపోతుందని వార్తలు వస్తుండడంతో అన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ల్యాండ్​స్కేప్​ గార్డెనింగ్​ను డెవలప్​చేయడంతో పాటు రక రకాల మొక్కలు,చెట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏలోని అర్బన్​ఫారెస్ట్రీ విభాగం వివిధ ప్రభుత్వ ఆఫీసుల ప్రాంగణాల్లో పచ్చదనం కోసం పలు కార్యక్రమాలు చేపట్టబోతోంది. 

జూపార్క్​, నిమ్స్​లో...

ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో  1.97 కోట్లతో  , పంజాగుట్టలోని నిమ్స్​దవాఖాన ప్రాంగణంలో రూ.3.48 కోట్లతో పెద్దఎత్తున ల్యాండ్​స్కేప్​గార్డెన్​ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూ పార్కుకు రోజూ వేల మంది సందర్శకులు వస్తుంటారు. దాదాపు 300 ఎకరాల్లో ఉన్న జూపార్క్​ను టూరిజం పరంగా కూడా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ముందుగా ల్యాండ్​స్కేప్​ను డెవలప్​ చేయనున్నారు.

 అలాగే, మెడికల్​ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలోని నిమ్స్​కు ప్రతి రోజూ వేలాది మంది రోగుల వారి బంధువులు వస్తుంటారు. ఇక్కడ వీరు సేదతీరేందుకు స్థలం లేదు. దీంతో వీరికి ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్ స్కేపింగ్​గార్డెన్​ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్​ అయితే మరికొన్ని ప్రభుత్వ విభాగాల ప్రాంగణాల్లోనూ ల్యాండ్​స్కేపింగ్​ ప్రాజెక్టులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.