- జులై-సెప్టెంబర్ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు
- 36 శాతం పెరిగినయ్
- 7 సిటీలలో 1,20,280 ఇండ్ల సేల్స్ అనరాక్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో 36 శాతం ఎగిశాయి. సగటు ఇండ్ల రేటు కూడా యాన్యువల్బేసిస్పై 11 శాతం పెరగ్గా, హైదరాబాద్లో మాత్రం ఏకంగా 18 శాతం ఎక్కువైంది. మొత్తం ఇండ్ల అమ్మకాలలో ముంబై, పుణె సిటీల వాటా 51 శాతంగా రికార్డయింది. రెపో రేటును ఆర్బీఐ మార్చకపోవడం వల్ల హోమ్లోన్ల వడ్డీ రేట్లు నిలకడగా ఉండటం సేల్స్ జోరుకు ఊతమిచ్చిందని అనరాక్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. జులై–సెప్టెంబర్ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు 1,20,280 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ నెంబర్ 88,230 గా ఉంది. క్వార్టర్లీ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్ క్వార్టర్ అమ్మకాలు ఆల్టైమ్ హై రికార్డు చేసినట్లు అనరాక్ రిపోర్టు పేర్కొంది. హౌసింగ్ డేటాలో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ఫ్లోర్లు ఉన్నాయి.
హైదరాబాద్లో 41 శాతం అప్...
జులై–సెప్టెంబర్ 2023 లో ఢిల్లీ–ఎన్సీఆర్లో హౌసింగ్ సేల్స్ 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది అమ్ముడైన ఇండ్ల సంఖ్య 14,970. ఇదే ముంబైలోనైతే ఇండ్ల అమ్మకాలు ఏకంగా 46 శాతం పెరిగి 38,500 యూనిట్లుగా రికార్డయ్యాయి. జులై–సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో ఎంఎంఆర్లో అమ్మకాలు 26,400 ఇండ్లు మాత్రమే. మరోవైపు, బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరాయి. హైదరాబాద్లో 41 శాతం గ్రోత్తో ఇండ్ల అమ్మకాలు 16,375 యూనిట్లుగా రికార్డయ్యాయి. పుణెలో అత్యధిక గ్రోత్ రికార్డయింది. ఈ సిటీలో ఇండ్ల సేల్స్ 63 శాతం ఎక్కువై 22,885 యూనిట్లకు చేరాయి. చెన్నైలో హౌసింగ్ సేల్స్ 42 శాతం పెరగ్గా, కోల్కతాలో 7 శాతం పెరిగినట్లు అనరాక్ రిపోర్టు వెల్లడించింది.
సొంత ఇల్లు కోరిక.....
ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు, సొంత ఇల్లు కావాలనే కోరిక బలంగా ఉండటంతో ఇండ్లకు గిరాకీ గత రెండేళ్లలో నిలకడగా ఎక్కువవుతోందని రియాల్టీ కంపెనీ క్రిసుమి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జైన్ చెప్పారు. భవిష్యత్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. లగ్జరీ ఇండ్ల గిరాకీ కూడా నిలకడగా పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ గిరాకీ దృష్టిలో పెట్టుకుంటే సప్లయ్ కూడా కొంత పటిష్టంగానే ఉంటుందని అన్నారు.