
- గుజరాత్ ప్లాంట్లో నాల్గో ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేయనున్న కంపెనీ
న్యూఢిల్లీ: టూ-వీలర్ల తయారీ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) గుజరాత్లోని విఠలాపూర్ ప్లాంట్ను విస్తరిస్తామని ప్రకటించింది. రూ.920 కోట్ల పెట్టుబడితో నాలుగో ప్రొడక్షన్ లైన్ను ఏర్పాటు చేస్తామంది. ఈ ప్రొడక్షన్ లైన్ కెపాసిటీ ఏడాదికి 6.50 లక్షల బండ్లు. ఇది 2027లో అందుబాటులోకి వస్తుందని అంచనా. దీనితో గుజరాత్ ప్లాంట్ మొత్తం కెపాసిటీ ఏడాదికి 26.1 లక్షల యూనిట్లకు చేరుతుంది. హోండా మోటార్సైకిల్కి చెందిన అతిపెద్ద అసెంబ్లీ ప్లాంట్గా మారుతుంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్స్ను ఆపరేట్ చేస్తోంది.
వీటి మొత్తం కెపాసిటీ ఏడాదికి 61.4 లక్షల యూనిట్లు. “హోండా చాలా కాలంగా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ, తన ప్రొడక్షన్ కెపాసిటీని విస్తరించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీ 2001లో ప్రొడక్షన్ మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 7 కోట్ల బండ్లను ఇండియాలో తయారు చేసింది” అని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్ త్సుట్సుము ఒటాని పేర్కొన్నారు. కంపెనీ హర్యానాలోని మనేసర్ ప్లాంట్లో ఏడాదికి 3.8 లక్షల యూనిట్ల కెపాసిటీ కలిగి ఉండగా, రాజస్థాన్లోని టపుకరా ప్లాంట్లో 13 లక్షల యూనిట్లు, కర్ణాటకలోని నరసాపురా ప్లాంట్లో 25 లక్షల యూనిట్లు తయారు చేస్తోంది.
అహ్మదాబాద్ దగ్గరలోని విఠలాపూర్ ప్లాంట్ ప్రస్తుతం సంవత్సరానికి 19.6 లక్షల యూనిట్లు తయారు చేస్తుండగా, తాజాగా ఈ ప్లాంట్లో నాల్గో ప్రొడక్షన్ లైన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో 1,800 కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని అంచనా.