న్యూఢిల్లీ: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ మార్కెట్లకు వస్తున్నాయి. వచ్చే నెలలోనే తమ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తామని హానర్ టెక్ ప్రకటించింది. ఇందుకోసం రూ. వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. హానర్ టెక్ చైనీస్ స్మార్ట్ పరికరాల కంపెనీ హానర్తో లైసెన్సింగ్ ఒప్పందం కింద పని చేయబోతోంది. ఈ విషయమై హానర్ టెక్ సీఈవో మాధవ్ సేఠ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరి నాటికి వాల్యూమ్ పరంగా 4-–5 శాతం మార్కెట్ వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనివల్ల కంపెనీకి రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
“కంపెనీ వ్యాపారం, అధికారం పూర్తిగా భారతీయుల చేతుల్లో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. హానర్టెక్ పూర్తిగా భారతీయ సంస్థ. మేం హానర్తో (చైనా కంపెనీ) లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం పని చేస్తాం. వాళ్లు మాకు లైసెన్స్ ఇస్తారు. అమ్మకాలు మొదలు తయారీ వరకు ప్రతిదీ మేమే చేస్తాం. హానర్కు రాయల్టీ ఉండదు" అని ఆయన చెప్పారు. హానర్ బ్రాండ్ను చైనీస్ టెలికాం మేజర్ హువావే ప్రారంభించింది. దీనిని నవంబర్ 2020లో మరొక చైనీస్ సంస్థ షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి విక్రయించింది. మాధవ్ సేఠ్ ఇటీవలే రియల్మీ నుంచి బయటకు వచ్చారు.
సీపీ ఖండేల్వాల్ యాజమాన్యంలోని పీఎస్ఏవీ గ్లోబల్తో కలిసి హానర్టెక్ అనే తన సొంత జాయింట్ వెంచర్ను స్థాపించారు. "హానర్లో 70 శాతం తయారీ పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ప్రొడక్టుల తయారీ విధానం, సప్లై చెయిన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్స్ వంటి విషయాల్లో హానర్ మాకు అవసరమైన సహకారం అందిస్తుంది" అని సేఠ్ చెప్పారు.