సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ఫోకస్ .. ప్రస్తుత లక్ష్యం 3,750 ఎకరాలు

సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ఫోకస్ .. ప్రస్తుత  లక్ష్యం  3,750 ఎకరాలు
  • మరో  రెండేళ్లలో 10 వేల ఎకరాలకు పెంచే ఆలోచన
  • ఝరాసంఘంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు

సంగారెడ్డి, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యానవన శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలో అనువైన నేలలు ఉండడంతో పంట ఉత్పత్తులను పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రెండేళ్ల క్రితం జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలం గోటిగారిపల్లిలో మొక్కలు నాటి ఆయిల్ పామ్ సాగు మొదలు పెట్టగా, దీనిపై సరైన అవగాహన లేక రైతులు ఆసక్తి చూపించలేదు. క్రమేణా సాగు విస్తీర్ణంపై అవగాహన పెంచుకున్న  రైతులు పంట దిగబడుల్లో మంచి ఫలితాలు రావడంతో సాగుపై దృష్టి మళ్లించారు. 

 జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించిన ఉద్యానశాఖ అధికారులు మరో  రెండేళ్లలో 10 వేల ఎకరాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా రైతులతో సదస్సులు ఏర్పాటు చేసి చైతన్య పరుస్తున్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో ఎర్ర, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండడంతో  రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.  ప్రభుత్వం రాయితీలతో ప్రోత్సహించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

సాగుకు అనువైన నేలలు

జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, రాయికోడ్,  పుల్కల్, న్యాల్కల్, మునిపల్లి, ఆందోల్ మండలాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనువైన నేలలుగా గుర్తించారు.  ఎర్ర, నల్లరేగడి పొలాల్లో నీరు నిలవకుండా ఉండేలా చూసుకొని బోరు, విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. దిగుబడులు నాలుగేళ్ల నుంచి మొదలై క్రమంగా 30 ఏళ్ల వరకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది టార్గెట్ కు  అనుగుణంగా నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2,400  ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు, అల్లం, ఆలుగడ్డ, బొప్పాయి, అరటి లాంటి వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తున్నారు. చెరుకు మినహా ఇతర పంటల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఆయిల్ ఫామ్ పంటలపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. 

ప్రభుత్వ రాయితీలు

ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. రైతు నుంచి ఒక్కో మొక్కకు రు.20 డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం అందుకు మొదట ఏడాదిలో మొక్కలకు రూ.11,600, అంతర పంటకు రూ.4,200, బిందు సేద్యానికి రూ.22,518 చెల్లించనుంది. అంతర పంటలకు మొదటి ఏడాది మాదిరిగా మరో మూడేళ్లపాటు యథావిధిగా రూ.4,200 చెల్లిస్తుంది. ఈ లెక్కన 4  ఏళ్ల పాటు  మొత్తం అన్నింటికి కలిపి రూ.50,918 లను ప్రభుత్వం రాయితీ కింద అందించనుంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే నేపథ్యంలో ప్రభుత్వం ఝరాసంఘం మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. 

ఆర్థికంగా బలపడతారు

 ఆయిల్ పామ్ పంటల సాగు ద్వారా మెరుగైన దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా బలపడతారు. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. ఈ ఏడాది జిల్లాలో 3,750 ఎకరాల్లో పంట సాగు కోసం అంచనాలు తయారు చేశాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపించాలి.

సోమేశ్వరరావు, ఉద్యానవన అధికారి