బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో మెట్రో సిటీలతో పోలిస్తే టైర్ 2, 3 సిటీలలో ఇండ్ల రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోలతో పోలిస్తే విశాఖపట్నం, గౌహతి, రాయ్పూర్, సూరత్, వడోదరా, జైపూర్, లక్నో, డెహ్రాడూన్ వంటి టైర్ 2 సిటీలలో, టైర్ 3 సిటీ అయిన కోయంబత్తూర్లో ఇండ్ల ధరలు వేగంగా పెరిగాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరగడం, ఫ్రీలాన్స్ జాబ్స్ ట్రెండ్ కూడా విస్తరించడంతో టైర్ 2, 3 సిటీలలో కూడా ఇండ్లకు డిమాండ్ ఎక్కువయ్యిందని వివరించింది. బెంగళూరులో 2018–19 లో ఇండ్ల ధరలు 8.7 % పెరగగా, 2019–20 లో పెద్దగా మారలేదు. అదే 2020–21 లో 6.2 శాతం, 2021–22 లో 3.3 % పెరిగాయి. అదే విశాఖపట్నంలో చూసుకుంటే ఇండ్ల ధరలు 2018–19 లో 4.9 %, 2019–20 లో 10.3 % పెరిగాయి. 2020–21 లో 2.5 % తగ్గినా , 2021–22 లో మాత్రం 11.3 % పెరిగాయి. దీనిని బట్టి కరోనా తర్వాత విశాఖపట్నం వంటి టైర్ 2 సిటీలలో ఇండ్ల ధరలు మెట్రో సిటీలలో కంటే వేగంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. అహ్మదాబాద్, చెన్నై మినహా ఇతర మెట్రో సిటీలలో 2021–22 లో ఇండ్ల ధరల పెరుగుదల 6 % కూడా దాటకపోవడాన్ని గమనించాలి. హైదరాబాద్లో ఇదే టైమ్లో ఇండ్ల రేట్లు 5–6 % మధ్య పెరిగాయి. మరోవైపు విశాఖపట్నం, గౌహతి, రాయ్పూర్, గాంధీనగర్, సూరత్, వడోదరా, జైపూర్, లక్నో, డెహ్రాడూన్ వంటి టైర్ 2 సిటీలలో మాత్రం 2021–22 లో ఇండ్ల ధరలు 10 % నుంచి 20 % మధ్య పెరగడాన్ని గమనించొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. టైర్ 3 సిటీలయిన కోయంబత్తూర్ (17.7 % ) , గ్రేటర్ నోయిడా (9.9%) లో కూడా ఇండ్ల ధరలు బాగానే పెరిగాయని వివరించింది.
కరోనా మార్చేసింది..
‘కరోనా సంక్షోభం వలన పుట్టుకొచ్చిందే వర్క్ ఫ్రమ్ హోమ్. సుమారు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ కరోనా మొదటి వేవ్ టైమ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని అమలు చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి. లేదా హైబ్రిడ్ మోడల్కు షిఫ్ట్ అవుతున్నాయి’ అని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడం, లివింగ్ కాస్ట్ టైర్ 2, 3 సిటీలలో తక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో సిటీల నుంచి ఇతర సిటీలకు మారుతున్నారని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది.