పార్లమెంటులోకి ఇద్దరు అగంతకులు దూసుకెళ్లి గ్యాస్ వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్సభ జరుగుతుండగా వారి లోపలికి వెళ్లారు. వారికి ఎవరైనా సహకరించారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఓ ఎంపీ సిఫార్సుతోనే లోనికి చేరినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. భద్రతా వైఫల్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీస్ విభాగం కూడా నిర్ణయించింది. ఇంతకీ పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఎలా జరిగింది లోపాలు ఎలా ఉన్నాయి?
- పార్లమెంటులో ఏ సభకు పోవాలన్నా ఎంపీ రిఫరెన్స్ ఉండాలి
- రిఫర్ చేసిన సభ్యుడే విజిటర్ గురించి, అతని మొబైల్ నంబర్ వివరాలకు బాధ్యత వహించాలి
- పార్లమెంట్ భవనం ఎంట్రీ నుంచి విజిటర్స్ గ్యాలరీ వరకు పలుదశల్లో చెకింగ్ ఉంటుంది.
- ఫిజికల్ తనిఖీలతో పాటు ఎలక్ట్రానిక్ డివైస్ లతో పరిశీలిస్తారు
- పర్స్ లాంటివి తప్ప మొబైల్, లాప్ టాప్, ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లతో పాటు పెన్ డ్రైవ్ లాంటి చిన్న వస్తువులను కూడా పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అవకాశం ఉంటుంది.
- విజిటర్స్ ఢిల్లీ అడ్రెస్ లేదా బయటివాళ్లు స్టే చేసే అడ్రెస్ వివరాలివ్వాలి
- పార్లమెంట్లో భారీ సెక్యూరిటీ ఉంటుంది
- పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది
- లోక్ సభ, రాజ్యసభలో ఎంచుకున్న సభలో విజిటర్స్ గ్యాలరీలోకి మాత్రమే అనుమతి అంతకుమించి పోవడానికి వీలుండదు.
- గ్యాలరీ లోంచి దూకిపోవడానికి అవకాశం ఉండకూడదు. పాత పార్లమెంట్లో గ్యాలరీ చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఆ అవకాశం లేదు. కొత్త భవనంలో తక్కువ ఎత్తులో, ఓపెన్ గా ఉండడం వల్ల ఈజీగా సభలోకి అడుగుపెట్టగలిగారు
- ప్రతిష్టాత్మకంగా కట్టిన కొత్త భవనం కావడంతో మరిన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయి
- పార్లమెంటుకు ఉగ్రవాద ముప్పు ఉంది. గతంలోనూ దాడి జరిగింది.
- మరోవైపు ఇటీవల ఖలిస్థానీ వాదుల ముప్పు పెరుగుతోంది.
- డిసెంబర్ 13న పార్లమెంట్లో సర్ ప్రైజ్ చేస్తామని కొన్నిరోజుల కిందే ఖలిస్థానీ గ్రూపు వార్నింగిచ్చింది.
- ఇన్ని జాగ్రత్తలు ఉన్నా, వార్నింగ్ అలర్టులు ఉన్నా పార్లమెంట్లో వస్తువులతో వ్యక్తులు వచ్చి అలజడి రేపడం సీరియస్ సెక్యూరిటీ వైఫల్యంగా భావిస్తున్నారు.