- డాక్టర్లకు పర్సనల్మెడికల్ కిట్లను ఇవ్వండి
- ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లకే కరోనా వస్తే పరిస్థితి ఎలా?
- ఈ విషయంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలన్న కోర్టు
- సరిపడా కిట్లు, మాస్కులు, గ్లోవ్స్ ఉన్నాయన్న సర్కారు
- ఎనిమిదో తేదీకి విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని సర్కారు దవాఖాన్లలో డాక్టర్లకు పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సామగ్రి ఇచ్చి ఉంటే.. అనేకమంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ ఎలా వస్తుందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే వాళ్లకే కరోనా వస్తుంటే.. పరిస్థితులు ఎటు దారి తీస్తున్నాయో పరిస్థితి అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, హెల్త్ సిబ్బందికి కరోనా సోకకుండా పర్సనల్ కిట్లు ఏమేరకు ఇచ్చారు, ఎంత స్టాక్ ఉందన్న దానిపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని వివరాలను ఏడో తేదీలోగా అందజేయాలని, ఎనిమిదో తేదీన తిరిగి విచారణ జరుపుతామని ప్రకటించింది.
తగిన రక్షణ లేకనే..
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో 37 మంది డాక్టర్లు, హెల్త్ సిబ్బందికి కరోనా సోకిందని, వారికి తగిన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని దాఖలైన ఏడు వేరువేరు పిల్స్పై డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. డాక్టర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు సరిగా ఇవ్వడం లేదని, అందుకే వారు కరోనా బారినపడుతున్నారని కోర్టుకు వివరించారు. డాక్టర్లకు ప్రొటెక్షన్ కిట్స్ ఇవ్వకపోతే ఎలాగని.. వారంతా వైరస్ బారినపడితే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవారే లేకుండా పోయే దుస్థితి వస్తుందన్నారు. సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సర్కారీ దవాఖాన్లలో డాక్టర్లకు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు, గౌన్లు, గ్లౌజులు, క్యాప్లు ఇస్తున్నామని బెంచ్కు చెప్పారు. వీటి నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని, కొరత లేదని వివరించారు. అయితే దీనిపై బెంచ్ ఘాటుగా స్పందించింది. ‘‘పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర రక్షణ సామగ్రి ఇచ్చి ఉంటే.. అంతమంది డాక్టర్లకు వైరస్ ఎట్లా సోకుతుంది..” అని నిలదీసింది. డాక్టర్లు, హెల్త్ సిబ్బంది, కరోనా కట్టడి కోసం విధుల్లో ఉన్న ఇతర స్టాఫ్కు మెడికల్ కిట్లను అందజేయాలని, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై సర్కారు తీసుకున్న చర్యలు, ఇతర వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్.. కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. ఏడో తేదీలోగా వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.