గాంధీ భవన్​లో సెక్యూరిటీ ఎట్లున్నది? : సీఎం మూమెంట్స్​ నేపథ్యంలో అధికారుల రివ్యూ

గాంధీ భవన్​లో సెక్యూరిటీ ఎట్లున్నది? : సీఎం మూమెంట్స్​ నేపథ్యంలో అధికారుల రివ్యూ
  • పార్టీ ఆఫీసును పరిశీలించిన పోలీసులు, ఇంటెలిజెన్స్​ సహా అన్ని శాఖల ఆఫీసర్లు

హైదరాబాద్​, వెలుగు :  కాంగ్రెస్​ పార్టీ స్టేట్ ఆఫీస్​ గాంధీభవన్​ సెక్యూరిటీపై అధికారులు రివ్యూ చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. సీఎం, మంత్రులు, ఇతర వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో భద్రతకు సంబంధించిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఆఫీసర్లు గాంధీభవన్​లో రివ్యూ చేశారు. గురువారం గాంధీభవన్​ అధికారులతో సమావేశమై పలు విషయాలను తెలుసుకున్నారు. డీసీపీ, ఇంటెలిజెన్స్​ అధికారులు, ఫైర్​ డిపార్ట్​మెంట్​, ఎలక్ట్రిసిటీ, జీహెచ్​ఎంసీ, ఆర్​ అండ్​ బీ, మెడికల్​ అండ్​ హెల్త్​, మున్సిపల్​ సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పార్టీ ఆఫీసును పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన ఉన్నప్పుడు ఆయన ఆఫీసులోకి రావడానికి అనుకూలంగా ఉండే గేట్లు, వాటి పటిష్ఠతకు సంబంధించి అధికారులు చర్చించినట్టు తెలిసింది. విద్యుత్, వాటర్, శానిటేషన్​ వంటి మౌలిక వసతులపైనా రివ్యూ చేశారని చెప్తున్నారు. పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు సీఎం రేవంత్​రెడ్డి తరచుగా పార్టీ ఆఫీసుకు రావాల్సి ఉండటం వల్లే రొటీన్​గా జరిగే రివ్యూల్లో భాగంగానే.. ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఈ రివ్యూలు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పార్టీ ఆఫీసు వద్ద పోలీసు భద్రతనూ పెంచారు.

టైట్​ సెక్యూరిటీ

పార్టీ ఆఫీసులో రేవంత్​ సమీక్షలు నిర్వహించే సమయంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పటిలాగా కాకుండా కేవలం అనుమతించిన వ్యక్తులనే లోపలికి రానిస్తున్నారు. మీటింగ్​లలో పాల్గొనేవారి జాబితాను తీసుకుని.. ఆ జాబితాలో పేరున్న వారిని మాత్రమే పార్టీ ఆఫీసులోకి అనుమతిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైనా పెద్ద మీటింగ్​ జరిగితే గాంధీభవన్​ మొత్తం ప్యాక్​ అయిపోయేది. ఇప్పుడు సీఎం, మంత్రుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. గాంధీభవన్​లో సీఎం ఉన్నంత సేపు పార్టీ ఆఫీసు బయటి రెండు గేట్లకూ తాళాలేస్తున్నారు. లోపలి వాళ్లను బయటకు.. బయటి వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. సీఎం పర్యటన ఉన్నప్పుడు కొంచెం ముందుగానే స్పెషల్లీ ట్రైన్డ్​ గార్డ్స్​తో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి తన కాన్వాయ్​ను 6 కార్లకు తగ్గించుకున్నారు. కాన్వాయ్​లోనూ తన సొంత కారులోనే ఆయన రాకపోకలు సాగిస్తున్నారు. ఇటు ట్రాఫిక్​ను ఆపకుండా సామాన్య జనంతో పాటే సీఎం కాన్వాయ్​ కూడా ప్రయాణిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం భద్రతకు సంబంధించి అధికారులు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.