ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఆర్బీఐ ఎంపీసీ) మీటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతారని అంచనా వేస్తున్నారు. రేట్ల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కిందటేడాది మే నుంచి వరసగా వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు అంటే ఈ నెల 6 వ తేదీ దాకా గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలో ఈ మీటింగ్ జరుగుతుంది. ఎంపీసీ నిర్ణయాన్ని గురువారం నాడు శక్తికాంత దాస్ ప్రకటిస్తారు.
మే 2022 నుంచి చూస్తే రెపో రేటును ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. రెపో రేటు పెంచినా ఇన్ఫ్లేషన్ మాత్రం ఆర్బీఐ టార్గెట్ అయిన 6 శాతం కంటే ఇంకా పైనే కొనసాగుతోంది. బాగా పెరిగిన రిటెయిల్ ఇన్ఫ్లేషన్తోపాటు, యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇటీవల తీసుకున్న చర్యలపైనా ఎంపీసీ మీటింగ్ దృష్టి పెట్టనుంది. నవంబర్, డిసెంబర్నెలల్లో 6 శాతం కిందకి దిగిన ఇన్ఫ్లేషన్ జనవరిలో మళ్లీ పైకి ఎగబాకింది. ఈ ఏడాది జనవరిలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధార ఇన్ఫ్లేషన్ 6.52 శాతంగాను, ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగాను రికార్డయింది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ సైకిల్లో రెపో రేటు పెంచడం ఇదే చివరిసారి కావొచ్చని వారు పేర్కొంటున్నారు. దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ను 4 శాతం కిందకి తేవాలని ఆర్బీఐ టార్గెట్గా పెట్టుకుంది. కానీ, అది ఇంకా 6 శాతం కిందకి దిగిరావడం లేదు. జనవరి 2022 నుంచి వరసగా మూడు క్వార్టర్లలోనూ రిటెయిల్ ఇన్ఫ్లేషన్ ఈ లెవెల్ కంటే పైనే కొనసాగింది.