కమ్మ, వెలమలకు ఫ్రీగా భూములు ఎట్లిస్తరు?

 కమ్మ, వెలమలకు ఫ్రీగా భూములు ఎట్లిస్తరు?
  • కమ్మ, వెలమలకు ఫ్రీగా భూములు ఎట్లిస్తరు?
  • ఖానామెట్​లో భూ కేటాయింపులపై సర్కార్​కు హైకోర్టు నోటీసులు
  • ఎందుకిచ్చారో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశం
  • ఉన్నత కులాలకు భూములు ఇవ్వడంపై కోర్టులో విచారణ​
  • ఎవరూ అడగకున్నా ఐదు రోజుల్లో భూమి ఇచ్చేశారన్న  పిటిషనర్​

హైదరాబాద్, వెలుగు: కోట్ల విలువజేసే భూములను కమ్మ, వెలమ కుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున ఉత్తగనే ఎట్ల కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వారికి భూమిని ఎందుకివ్వాల్సి వచ్చిందో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇటీవల సర్కార్ నిర్వహించిన వేలంలో కోకాపేటలో ఎకరం భూమి రూ.60 కోట్లు పలికిందని.. అదే హైటెక్‌‌ సిటీకి సమీపంలోని అత్యంత ఖరీదైన ఖానామెట్‌‌ ఏరియాలో అయితే ఎకరాకు వంద కోట్ల దాకా ఉంటుందని చెప్పింది. 
కమ్మ, వెలమ కుల సంఘాలకు ఉచితంగా భూమిని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో కమ్మ, వెలమ కులాలకు ఖానామెట్‌లోని సర్వే నెం. 41/14లో ఐదు ఎకరాల చొప్పున కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్​47 చట్టవిరుద్దమని పేర్కొంటూ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఈ పిల్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ.. భూమి కేటాయింపు ప్రక్రియ పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. జూన్‌ 26న కలెక్టర్‌ నుంచి సీసీఎల్‌ఏకు భూమి కేటాయించాలంటూ రిపోర్ట్ అందిందన్నారు. రెండు రోజుల తర్వాత 28వ తేదీన కలెక్టర్ ​ప్రభుత్వానికి సిఫార్సు చేశారని.. ఇంకో రెండు రోజులకే 30వ తేదీన భూమి కేటాయిస్తూ జీవో జారీ అయిందన్నారు. ఇదంతా అత్యంత వేగంగా కేవలం ఐదురోజుల్లోనే పూర్తయిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థితిలో ఉన్న కమ్మ, వెలమ కులాలకు ఎందుకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించిందో జీవోలో పేర్కొనలేదన్నారు. అత్యంత విలువైన భూమిని ఆగమేఘాలపై ఇచ్చేశారని తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల్లో పాలన సాగించిన, సాగిస్తున్న కులాలకు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ కులాలు సామాజికంగా, ఆర్థికంగా బలహీనవర్గాలేమీ కాదన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు కులాలదే పైచేయి అన్నారు. ఆ రెండు కుల సంఘాలు భూమి కావాలని కోరకున్నా.. ప్రభుత్వం భూమిని ధారాదత్తం చేసిందని వివరించారు. 
మార్కెట్ ధరలు నిర్ణయిస్తం: ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ ఇతర సంఘాలకు ఇచ్చినట్లుగానే కమ్మ, వెలమ కుల సంఘాలకు కూడా భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఉచితంగా కేటాయింపు చేయలేదని, మార్కెట్‌ ధరలను నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగానే భూమిని వారికి స్వాధీనం చేశామన్నారు. వాదనలు విన్న తర్వాత.. పిటిషనర్‌ చెబుతున్నట్లుగా అంత ఖరీదైన భూములను కమ్మ, వెలమ కులాలకు ఎట్ల కేటాయించారని హైకోర్టు ప్రప్రశ్నించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, వెలమ, కమ్మ సంఘాల సమాఖ్యలకు నోటీసులు ఇచ్చింది. ఈ దశలో పిటిషనర్ తరఫు లాయర్​ కల్పించుకుని ఈలోగా ఆ భూముల్లో నిర్మాణాలు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తోసిపుచ్చిన హైకోర్టు..  కేసు విచారణలో ఉండగా నిర్మాణాలు జరిగితే అవన్నీ తాము వెలువరించే ఉత్తర్వులకు లోబడే ఉంటాయని గుర్తు చేసింది. విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసింది.