
- 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక శాతం కోత
- హోమ్, వెహికల్ లోన్లపై తగ్గనున్న వడ్డీ
- ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి..
- జీడీపీ గ్రోత్ మాత్రం 6.5 శాతం దగ్గరనే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచింది. వడ్డీ రేట్లను ఊహించని దానికంటే ఎక్కువగా 50 బేసిస్ పాయింట్లు (0.5శాతం) తగ్గించింది. అలాగే, బ్యాంకుల క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ దగ్గర ఉంచే క్యాష్) ని 100 బేసిస్ పాయింట్స్ (ఒక శాతం) తగ్గించి 3 శాతానికి తీసుకొచ్చింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మరో రూ.2.5 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా. ఆరుగురు సభ్యులు గల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ), గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి తీసుకొచ్చింది.
2020 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి (25 బేసిస్ పాయింట్లు)లో రేట్ల కోతను మొదలు పెట్టిన ఆర్బీఐ, ఏప్రిల్లో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక శాతం తగ్గించింది. ఈ చర్యల వల్ల రెపో రేటుకు లింకై ఉన్న హోమ్ లోన్స్, ఆటో లోన్స్, ఇతర లోన్ల ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. అలానే బిజినెస్ లోన్లపై వడ్డీ తగ్గుతుందని, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కూడా తగ్గుతుందని గుర్తు పెట్టుకోవాలి. సీఆర్ఆర్ తగ్గడంతో బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెరుగుతుందని, ఇవి ఇచ్చే లోన్లు పెరుగుతాయని ఎనలిస్టులు వివరించారు. ఆర్బీఐ తన మానిటరీ పాలసీ విధానాన్ని‘అకామడేటివ్’ నుంచి ‘న్యూట్రల్’కి మార్చింది. అంటే, భవిష్యత్లో ఎకానమీ డేటా బట్టి రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సమీప కాలంలో రేట్ల కోత ఉండకపోవచ్చని మల్హోత్రా సంకేతాలు ఇచ్చారు. కాగా, రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే షార్ట్-టర్మ్ ఫండింగ్ రేటు. ఈ 50 బేసిస్ పాయింట్ల కోత వల ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్స్(ఈబీఎల్ఆర్) తగ్గుతాయి.
రేట్లను ఎందుకు తగ్గించారంటే?
ఆర్థిక వృద్ధికి సపోర్ట్ ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెబుతున్నారు. తాజాగా తీసుకున్న చర్యలతో జీడీపీ గ్రోత్ 7–-8శాతం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) బాగా తగ్గింది. అక్టోబర్ 2024లో ఆర్బీఐ లిమిట్ 4 శాతం పైన ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, తాజాగా ఈ లెవెల్ దిగువకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.7 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. గతంలో వేసిన 4 శాతం అంచనా నుంచి తగ్గించింది. కాగా, ఏప్రిల్ 2025లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే సీపీఐ 3.16 శాతంగా రికార్డయ్యింది(జులై 2019 తర్వాత తక్కువ). గత మూడు నెలలుగా 4 శాతం దిగువను సీపీఐ నమోదవుతోంది. దీంతో ద్రవ్యోల్బణంపై విజయం సాధించామని మల్హోత్రా కామెంట్ చేశారు. మరోవైపు జీడీపీ గ్రోత్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 6.5 శాతంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పాలసీల వల్ల ట్రేడ్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. దీంతో జీడీపీ వృద్ధిపై అనిశ్చితి నెలకొంది.
ఓనర్షిప్ లిమిట్ యథాతథం
- ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో ఫారిన్ ఓనర్షిప్ లిమిట్ను 15 శాతం నుంచి పెంచే ఆలోచన లేదని మల్హోత్రా వివరించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ఎక్కువ బ్యాంకులు అవసరమని అన్నారు. కానీ నమ్మదగ్గ ఓనర్స్, మేనేజర్స్ ఉండాలని చెప్పారు. ఈ రూల్కు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, సీఎస్బీ బ్యాంక్లో కెనడా ఇన్వెస్టర్ ఫెయిర్ఫాక్స్కు 51 శాతం కొనేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఇటీవల, యెస్ బ్యాంక్లో జపాన్కు చెందిన ఎస్ఎంబీసీ 20 శాతం వాటా హోల్డ్ చేయడానికి అనుమతించారు.
- ఇంటర్నల్గా ఆర్థిక మోసం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండస్ఇండ్ బ్యాంక్, ఇప్పుడు బాగానే పనిచేస్తోందని మల్హోత్రా కామెంట్ చేశారు. సమస్యకు బాధ్యత తీసుకోవడానికే బ్యాంక్ ఎండీ సుమంత్ కథ్పాలియా రాజీనామా
- చేశారన్నారు.
- ఇక నుంచి గోల్డ్ వాల్యూలో 85 శాతం వరకు అమౌంట్ను లోన్గా పొందొచ్చు. రూ.2.5 లక్షల లోపు విలువున్న లోన్ల కోసం లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) రేషియోను ఆర్బీఐ 75 శాతం నుంచి 85 శాతానికి పెంచింది.
- క్రిప్టో విషయంలో కొత్త డెవలప్మెంట్ ఏమీ లేదని మల్హోత్రా అన్నారు. ప్రభుత్వ కమిటీ దీన్ని చూస్తోందని, క్రిప్టో వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, మానిటరీ పాలసీకి హాని కలగొచ్చని పేర్కొన్నారు.