దసరాకు ఇన్ని బండ్లు కొన్నారా..! భారీగా బండ్ల సేల్స్.. జీఎస్టీ తగ్గడంతో ఎగబడి కొన్న జనం..

దసరాకు ఇన్ని బండ్లు కొన్నారా..! భారీగా బండ్ల సేల్స్.. జీఎస్టీ తగ్గడంతో ఎగబడి కొన్న జనం..
  • నవరాత్రుల్లో 35 శాతం వృద్ధి.
  • గత నెల 6 శాతం పెరుగుదల 
  • వెల్లడించిన ఫాడా

న్యూఢిల్లీ:ఈ ఏడాది నవరాత్రుల సమయంలో వాహనాలు విపరీతంగా అమ్ముడుపోయాయి. ప్యాసింజర్ వెహికల్స్  అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయి.  సెప్టెంబరులో బండ్ల రిజిస్ట్రేషన్లు 6 శాతం పెరిగాయి.  గత నెల మొదటి 21 రోజుల్లో మాత్రం అమ్మకాలు మందగించాయి.  సెప్టెంబర్​ 22న కొత్త జీఎస్​టీ రేట్లను ప్రకటించాక వెహికల్స్ అమ్మకాలు ఊపందుకున్నాయని ఫెడరేషన్​ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్స్ (ఫాడా) మంగళవారం (అక్టోబర్ 07) తెలిపింది. 

పండుగ కాలంలో మొత్తం 2,17,744 ప్యాసింజర్​ వెహికల్స్ రిటైల్ అమ్ముడయ్యాయి. ఇవి గత ఏడాది నవరాత్రి పండగ సమయంలో అమ్ముడైన 1,61,443 యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ బంపర్​ సేల్​తో సెప్టెంబర్​లో పీవీల అమ్మకాలు 2,99,369 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 2,82,945 యూనిట్లతో పోలిస్తే ఇవి 6 శాతం ఎక్కువ.  

‘‘భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సెప్టెంబర్ ఒక అసాధారణ నెల. జీఎస్టీ రేట్లు తగ్గుతాయి కాబట్టి మొదటి మూడు వారాలు కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు.  నవరాత్రి ఉత్సవాలు, జీఎస్​టీ కొత్త రేట్ల అమలుతో చివరి వారంలో మార్పు వచ్చింది. కస్టమర్ల సెంటిమెంట్​ పెరిగి, వెహికల్స్ డెలివరీలు వేగవంతం అయ్యాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్​ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం అన్ని విభాగాల్లో  సానుకూల వృద్ధి కనిపించింది. మొత్తం మీద 5 శాతం వృద్ధి నమోదయింది.  ఈ ఊపు దీపావళి వరకు కొనసాగుతుందని ఫాడా తెలిపింది.

7 శాతం పెరిగిన టూవీలర్​సేల్స్​

గత నెలలో 12,87,735 టూవీలర్లు అమ్ముడయ్యాయి.  సెప్టెంబర్​ 2024లో అమ్ముడైన12,08,996 యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం వృద్ధి. నవరాత్రి పండుగ కాలంలో అమ్మకాలు 36 శాతం పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో 6,14,460 యూనిట్లు అమ్ముడయ్యాయి.  త్రీవీలర్స్​ అమ్మకాలు 1,06,534  యూనిట్ల నుంచి   98,866 యూనిట్లకు పడిపోయాయి.  నవరాత్రి పండుగ కాలంలో రిటైల్ అమ్మకాలు 25 శాతం పెరిగి 46,204 యూనిట్లకు చేరాయి.

 అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 37,097 యూనిట్లు అమ్ముడయ్యాయి. కమర్షియల్​ వెహికల్స్ అమ్మకాలు గత నెలలో 3 శాతం పెరిగి 72,124 యూనిట్లుగా నమోదయ్యాయి.  ట్రాక్టర్​ రిటైల్ అమ్మకాలు నాలుగు శాతం ఎగిసి 64,785 యూనిట్లకు చేరుకున్నాయి. నవరాత్రి సమయంలో రిటైల్ అమ్మకాలు 19 శాతం పెరిగి 21,604 యూనిట్లకు చేరాయి.  గత నెలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం అమ్మకాలు 18,27,337 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్​ 2024లో 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5 శాతం ఎక్కువ.  

నవరాత్రి అమ్మకాలు 34 శాతం పెరిగి 11,56,935 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది 8,63,327 యూనిట్లు మాత్రమే సేల్​అయ్యాయి.  ఈ ఏడాది భారీ వర్షాలు, పంటలు బాగుండటం, తక్కువ రేట్లు కస్టమర్లు కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా తెలిపింది.