విగ్రహం ధ్వంసం వెనక పెద్ద కుట్ర

విగ్రహం ధ్వంసం వెనక పెద్ద కుట్ర

నిందితులను కఠినంగా శిక్షించాలి: స్వామి పరిపూర్ణానంద

హైదరాబాద్​(ఖైరతాబాద్), వెలుగు: పిఠాపురం ఆలయ విధ్వంసం వెనక పెద్ద కుట్ర ఉందని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. గుడిలోని 23 విగ్రహాలు ధ్వంసమయ్యాయని, ఇదంతా చేసిన వ్యక్తికి మతిస్థిమితంలేదని పోలీసులు చెప్పడాన్నీ తప్పుబట్టారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. మతిస్థిమితంలేని వ్యక్తి కేవలం హిందూ ఆలయాలనే టార్గెట్​ చేసుకుని విగ్రహాలను కూలగొడతాడా అని ప్రశ్నించారు.

బుధవారం సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​లో పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడారు. రాళ్లదాడిని హిందూ సమాజంపై జరిగిన దాడి అన్నారు. దేశంలో సెక్యులరిజం అంటే.. హిందువులను వ్యతిరేకించడమే అన్నట్లుగా ఉందన్నారు. హిందువుల హక్కుల గురించి మాట్లాడితే మతతత్వవాదులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. విగ్రహాలను ధ్వంసంచేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.