యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు క్యూ కట్టారు. రద్దీ కారణంగా  ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశం..కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి.

ఆలయంలో నిర్వహించిన నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.45,01,535 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.19,83,400, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6 లక్షలు, వీఐపీ టికెట్ల ద్వారా రూ.4.80 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,49,100, యాదరుషి నిలయం ద్వారా రూ.2,23,190, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,71,400 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.