- రూ.2 లక్షల కోట్లకు చేరిన అదానీ ట్రాన్స్మిషన్ వాల్యుయేషన్
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 330 శాతం పెరిగిన షేర్లు
- త్వరలో అదానీ గ్రీన్ఎనర్జీ కూడా ఈ రికార్డు సాధించే చాన్స్
న్యూఢిల్లీ: కరెంటు సప్లై సేవలు అందించే అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ వాల్యుయేషన్ రూ.రెండు లక్షల కోట్లకు చేరింది. ఈ కంపెనీ షేర్లపై ఎనలిస్టులు వార్నింగ్ ఇచ్చినా షేర్ల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు 331శాతం పుంజుకున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద ప్రైవేట్ రంగ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీగా ఎదిగింది. అయితే ఊహాగానాలు, పుకార్ల వల్లే అదానీ షేర్లు పెరుగుతున్నాయని కొందరు ఎనలిస్టులు ఇటీవల చెప్పారు. చాలా తక్కువ షేర్లు ట్రేడవుతున్నాయని, మిగతావన్నీ విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయని హెచ్చరించారు.
అదానీ ట్రాన్స్మిషన్ షేర్లలో భారీ ర్యాలీ
అదానీ ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ. 2 లక్షల కోట్లు (దాదాపు 28 బిలియన్ డాలర్లు) మార్క్ దాటిన మొదటి అదానీ గ్రూప్ కంపెనీగా అవతరించింది. కంపెనీ షేర్లు గత మూడునెలల్లో 91శాతం పెరగగా, 2021 లో ఇప్పటివరకు 331శాతం పుంజుకున్నాయి. మార్కెట్లో చాలా తక్కువ షేర్లు మాత్రమే అందుబాటులో ఉండటం కూడా ర్యాలీకి గల కారణాల్లో ఒకటి. కంపెనీకి మొత్తం 1.10 బిలియన్ల షేర్లు ఉండగా, 319.58 మిలియన్ షేర్లను మాత్రమే కంపెనీ ట్రేడింగుకు అందుబాటులోకి ఉంది. దాదాపు 81శాతం షేర్లు విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. రూ.రెండు లక్షల కోట్ల వాల్యుయేషన్కు దగ్గరగా ఉన్న మరో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ఇటీవల గ్రీన్ బాండ్ల అమ్మకం ద్వారా 750 మిలియన్ డాలర్లు సేకరించింది. చమురు గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తోంది. అందుకే ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్తునాయి. అదానీ పవర్ మినహా అన్ని అదానీ గ్రూప్ కంపెనీల వాల్యుయేషన్ రూ.1.5 లక్షల కోట్లకు చేరింది.