అనుమానంతో భార్య చెయ్యి నరికేశాడు

అనుమానంతో భార్య చెయ్యి నరికేశాడు

దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో  లొంగిపోయిన భర్త

వికారాబాద్,వెలుగు: భార్యపై అనుమానంతో ఆమెతో గొడవపడిన భర్త కత్తితో ఆమె చెయ్యి నరికిన ఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అలవోని గోవిందమ్మ(38)తో, అదే మండలం తిర్మాలపూర్ గ్రామానికి చెందిన నారాయణ(45)కి18 ఏండ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గోవిందమ్మకు వేరే వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో నారాయణ ఏడాది క్రితం ఆమెతో గొడవపడ్డాడు. రోజూ నారాయణ..అనుమానంతో గోవిందమ్మతో గొడవపడుతుండటంతో ఇద్దరూ ఏడాది క్రితం నుంచి విడివిడిగా ఉంటున్నారు.  గోవిందమ్మ ఉపాది కోసం దౌల్తాబాద్ మండల కేంద్రంలో బేకరీ నిర్వహిస్తుండగా..దాని పక్కనే నారాయణ కిరాణా షాప్ పెట్టుకున్నాడు. గోవిందమ్మ పై   మరింత అనుమానం పెంచుకున్న నారాయణ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బేకరీ దగ్గరకి వెళ్లి..కత్తితో గోవిందమ్మ చెయ్యి నరికేశాడు. ఈ దాడిలో గోవిందమ్మ మోచేతి కింది బాగం తెగిపడిపోయింది. గోవిందమ్మ అక్కడిక్కడే స్పృహ కొల్పోయింది. గోవిందమ్మపై దాడి చేసిన తర్వాత నారాయణ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోవిందమ్మను పోలీసులు 108లో సిటీలోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ చెప్పారు.