గద్వాల, వెలుగు: మొదటి సారి ఆడపిల్ల పుట్టిందని సూటిపోటి మాటలతో భార్యను వేధిస్తున్న భర్త.. రెండో కాన్పులోనూ ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా పుట్టడంతో గొంతు నులిమి చంపేశాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని నల్లకుంటకు చెందిన వెంకటేశ్ మల్లకల్ ఎంపీడీవో ఆఫీసులో అటెండర్గా పని చేస్తున్నాడు. వనపర్తి జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన పల్లవి అలియాస్ అన్నపూర్ణను 2019లో పెండ్లి చేసుకున్నాడు. రూ.6 లక్షలు, 6తులాల గోల్డ్, ప్లాట్ ను కట్నం కింద తీసుకున్నాడు. వెంకటేశ్, అన్నపూర్ణకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భార్యను వెంకటేశ్ వేధిస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచులు సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టేవారు. ఈ నెల 22న గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నపూర్ణ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు ఆరోగ్యంగా ఉండటంతో శనివారం వారిని డిశ్చార్జ్ చేశారు.
ఫిట్స్ వచ్చిందని తల్లిదండ్రులకు ఫోన్
మళ్లీ ఆడపిల్లలు పుట్టారు కాబట్టి, అదనపు కట్నం తీసుకురావాలని శనివారం నాడే వేధింపులు స్టార్ట్ చేశాడు. గొడవ పెద్దది కావడంతో అన్నపూర్ణను చెంపలపై కొడుతూ గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అన్నపూర్ణను ఆదివారం ఉదయం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని చెప్పారు. తన పలుకుబడితో పోస్టుమార్టం చేయకుండానే శవాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత అన్నపూర్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పాడు. ఆమె తండ్రి ఆంజనేయులు, కుటుంబసభ్యులు వచ్చి చూడగా హత్య చేసినట్టు బయటపడింది. దాంతో ఆదివారం కుల పంచాయతీ నిర్వహించారు. అందులో ఏమీ తేలకపోవడంతో అన్నపూర్ణ తల్లిదండ్రులు సోమవారం భర్త, అత్త, మామ, ఆడపడుచులు, మరిది కలిసి తన కూతురును చంపేశారని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం కోసం శవాన్ని మళ్లీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.