హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్లో మోడ్రన్ ఫిష్ మార్కెట్, కూలింగ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ సీజన్లో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. చేపపిల్లల పంపిణీలో పారదర్శకత కోసం ప్రతీ చెరువు వద్ద సైన్ బోర్డుల ద్వారా పిల్లల రకం, సంఖ్య వివరాలు వెల్లడించే విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గురుకులాల మెనూలో చికెన్, మటన్తో పాటు చేపలను ప్రవేశపెడతామని చెప్పారు. కలెక్టర్ హైమావతి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.
