
- వరల్డ్ బాక్సింగ్ సెమీస్లో హుస్సామ్, దీపక్, నిశాంత్
తాష్కెంట్: ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ ఆటగాడు మహ్మద్ హుస్సాముద్దీన్ మెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తన పంచ్ పవర్ చూపెట్టాడు. మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమీఫైనల్కు దూసుకెళ్లిన హుస్సామ్ కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు. అతనితో పాటు దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ కూడా సెమీస్ చేరారు. దాంతో, ఈటోర్నీ చరిత్రలో ఇండియాకు అత్యధికంగా మూడు పతకాలు ఖాయం అయ్యాయి. 2019లో సిల్వర్, బ్రాంజ్ రావడమే ఇప్పటిదాకా బెస్ట్ పెర్ఫామెన్స్. బుధవారం జరిగిన 57 కేజీ క్వార్టర్ ఫైనల్లో హుస్సాముద్దీన్ 4–3తో ఐదో సీడ్ దియాజ్ ఇబనేజ్ (బల్గేరియా)పై ఉత్కంఠ విజయం సాదించాడు.
హోరాహోరీగా సాగిన పోరులో తొలి రౌండ్లో తెలంగాణ స్టార్ 3–2తో పైచేయి సాధించాడు. రెండో రౌండ్ నుంచి మరింత కాన్ఫిడెంట్ ఆడి ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపెట్టాడు. ఇబనేజ్పై బలమైన పంచ్లు విసిరాడు. సెమీస్లో హుస్సామ్క్యూబాకు చెందిన సైడెల్ హొర్టాతో పోటీ పడతాడు. 51 కేజీ క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిట్ (కిర్గిస్తాన్)ను చిత్తు చేశాడు. 71 కేజీ బౌట్లో నిశాంత్ సైతం 5–0తో క్యూబాకు చెందిన జార్జ్ క్యుయెలర్ను నాకౌట్ చేశాడు. సెమీస్లో అతను ఆసియా చాంపియన్ అస్లన్బెక్ (కజకిస్తాన్) తో పోటీ పడతాడు. దీపక్.. ఫ్రాన్స్కు చెందిన బెన్నమాతో తలపడనున్నాడు. శుక్రవారం సెమీఫైనల్స్ జరుగుతాయి.