ఫోర్జరీ డాక్యుమెంట్లతో బెయిల్‌ ఇప్పిస్తున్రు

ఫోర్జరీ డాక్యుమెంట్లతో బెయిల్‌ ఇప్పిస్తున్రు

హుజూర్ నగర్, వెలుగు: నకిలీ పత్రాలతో జమానత్ లు ఇచ్చి తెలంగాణ, ఏపీలోని పలు కోర్టులను మోసం చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను, జమానత్​ఇచ్చిన 24 మందిని హుజూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్​రెడ్డి హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలు శుక్రవారం వెల్లడించారు. హుజూర్ నగర్ ఎస్సై కట్ట వెంకటరెడ్డి శుక్రవారం ఉదయం పట్టణంలో సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా.. కోర్టు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్నవారిని ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు తడబడడంతో చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కస్తాల గోపయ్య, నాగరాజు, నాగేశ్వర రావు, మునగలేటి లింగయ్యను స్టేషన్ కు తరలించి విచారించారు. వారిచ్చిన సమాచారంతో మిర్యాలగూడ అదనపు కోర్టులో ఔట్ సోర్సింగ్​ఉద్యోగిగా పనిచేసిన నల్గొండ జిల్లా వేములపల్లికి చెందిన మామిడి భానుప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి, దొంగతనాల కేసుల్లో జైలులో ఉన్న అంతర్రాష్ట్ర నేరస్తులకు గ్రామ పంచాయతీల పన్ను రశీదు పుస్తకాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బెయిల్​ఇప్పిస్తున్నట్లు తేలింది. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు.

నిందితులు కొన్నేండ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజమండ్రి, విజయవాడ, జగ్గయ్యపేట, హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నిడమనూరు, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ లోని పలు కోర్టుల్లో నకిలీ ష్యూరిటీలతో బెయిల్​ఇప్పించినట్లు గుర్తించారు. రబ్బరు స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్లను తయారుచేసిన మిర్యాలగూడకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పిల్లలమర్రి శ్రీనివాస్, చిదెల్లి రవి, రేకప్ ఈశ్వర్, నిందితులకు జమానత్ ఇచ్చిన 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 22  మంది పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్​చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. కేసులో లాయర్ల ప్రమేయంపై విచారించి సంబంధం ఉన్నట్లయితే  వారిని కూడా అరెస్టు
 చేస్తామని డీఎస్పీ తెలిపారు .