సదర్​కు హైదరాబాద్ సిటీ రెడీ

సదర్​కు హైదరాబాద్ సిటీ రెడీ
  • నారాయణగూడ, ఖైరతాబాద్​లో భారీ ఏర్పాట్లు 
  • పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన దున్నపోతులు
  • ఒక్కోటి రూ.20కోట్లపైనే రేటు.. 
  • రోజుకు 10 వేల దాకా ఖర్చు

హైదరాబాద్, వెలుగు: దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్‌ కు సిటీ రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి సదర్ వేడుకలు స్టార్ట్ అవుతాయని నిర్వాహకులు తెలిపారు. కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, ఈస్ట్‌ మారేడ్‌ పల్లి, చప్ప ల్‌ బజార్‌, మధురాపురి, కార్వాన్, నార్సింగి, ఓల్డ్​సిటీ తదిరత ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సదర్​లో ఖైరతాబాద్​ చెందిన షారూఖ్ (రూ.30కోట్లు), లవ్రాణా (రూ.25 కోట్లు) , నారాయణగూడలో (రూ.16 కోట్లు) కింగ్‌, సర్తాజ్‌ (దున్నపోతులు) ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.  ప్రతిఏటా నారాయణగూడలో జరిగే సదర్ హైలెట్ గా ఉంటుంది.  ఈసారి అంతకు మించి ఖైరతాబాద్ లో ​నిర్వహించేందుకు పోటీ పడి ఏర్పాట్లు చేస్తున్నారు. చూసేందుకు వేలాదిమంది జనాలు వచ్చే అవకాశం ఉంది. 
పంజాబ్, హర్యానాల నుంచి ప్రత్యేక దున్నలు
సిటీలో సదర్ వేడులకు పంజాబ్, హర్యానాల నుంచి భారీ దున్నపోతుల‌ను తీసుకొచ్చారు. సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని వీటిని ముందుగానే రప్పించారు. ఇవి ఫిట్​నెస్​గా ఉండేందుకు కొన్ని  నెలల పాటు తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి తాపిస్తారు. ఇక్కడి వాతావరణానికి అలవాటైనంకా మెల్లగా డైలీ డజన్ యాపిల్స్, డ్రై ప్రూట్స్, ఒంట్లో వేడికోసం వీక్లి టూ టైమ్స్ జానీవాకర్, రెడ్​లేబుల్​ఆల్కాహల్ తాగిస్తారు.  స్విమ్మింగ్​ఫూల్లో స్నానం చేయించి ఆవనూనెతో మసాజ్ చేస్తారు. వీటిని చేసేందుకు ప్రత్యేకంగా  వ్యక్తులుంటారు.  డైలీ వీటి మెయింటెనెన్స్​కు ఒక్కోదానికి రూ.10వేల వరకు ఖర్చవుతాయి. సదర్ పండగకు వారం ముందునుంచే అలంకరణ స్టార్ అవుతుంది.

దున్నపోతు మీద పెరిగిన  వెంట్రుకలను తీసి నల్లగా నిగనిగలాడేలా చేస్తారు. ఈసారి ముషీరాబాద్‌ లో  హర్యానా నుంచిరూ. 16కోట్ల పెట్టి  ప్రత్యేకంగా తీసుకొచ్చిన దున్నలను పెంచుతున్నట్లు అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్‌ తెలిపారు.  ఈనెల 6న జరిగే సదర్‌లో వీటిని ప్రదర్శిస్తామన్నారు. అట్లనే ఖైరతాబాద్​లోని దూద్​వాలా డెయిరీ నిర్వాహకులు దొడ్ల లక్ష్మణ్ యాదవ్, మధు యాదవ్, చందు యాదవ్​ రూ. 30 కోట్లు, రూ.25కోట్లు పెట్టి రెండు దున్నపోతులను తీసుకొచ్చి రెడీ  చేస్తున్నారు.
1946 నుంచి.. 
సిటీలో మొదటిసారిగా 1946లో సదర్ ​వేడుకలను చౌదరి మల్లయ్య యాదవ్ ప్రారంభించాడు. నిజాం కాలంలో  గొల్ల, కురుమలు పశుసంపదపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవారు. తమ పశు సంపదను ప్రదర్శించడమే సదర్ వేడుక ప్రారంభానికి వేదికైంది. సదర్ వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటాయి. యాదవులందరూ జోష్​చేస్తారు.