కాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం

కాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం
  • రంగారెడ్డి జిల్లాలోని ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల పాగా
  • బీఆర్ఎస్​ ఖాతాలోకి ఇబ్రంహీంపట్నం, ఆమన్​గల్ 
  • వికారాబాద్​ జిల్లాలో మూడు చోట్లా హస్తమే 
  • మేడ్చల్​లో  రెండు చోట్ల బీఆర్ఎస్

చేవెళ్ల/షాద్​నగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగించింది. రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాల్లో మొత్తం13 మున్సిపల్​చోట్ల ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్​మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో ఆరు మున్సిపల్​స్థానాలకు నాలుగు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్​గెలిచింది. 

చేవెళ్ల, శంకర్​పల్లి, షాద్​నగర్​లో చైర్​పర్సన్​కు కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ను కాంగ్రెస్ దాటింది. మొయినాబాద్​లో మాత్రం ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్​పర్సన్​ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆమన్​గల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్​తన ఖాతాలో వేసుకున్నది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయింది. 

శంకర్​పల్లిలో అయితే ఖాతా కూడా తెరవలేదు. చేవెళ్లలో మూడు,  షాద్​ నగర్​లో​ ఒకటి, ఇబ్రహీంపట్నంలో రెండు స్థానాలు, ఆమన్​గల్​లో ఆరు, మొయినాబాద్​4 వార్డుల్లో విజయం సాధించింది. ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా చూస్తే..  126 వార్డుల్లో 54 కాంగ్రెస్​, 47 బీఆర్ఎస్​, 16 బీజేపీ, తొమ్మిది స్థానాలను ఇండిపెండెంట్​అభ్యర్థులు గెలుపొందారు.  

మూడు చోట్ల స్పష్టమైన మెజారిటీ

చేవెళ్లలో 18 వార్డులు ఉండగా.. 11 కాంగ్రెస్​, 4 బీఆర్ఎస్​, 3 చోట్ల బీజేపీ గెలిచింది. శంకర్​పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులకు 9  కాంగ్రెస్, 4 బీఆర్​ఎస్, 1 స్థానంలో ఇండిపెండెంట్​అభ్యర్థి గెలిచారు. షాద్​ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా..15 కాంగ్రెస్​, 11 బీఆర్ఎస్​, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్​అభ్యర్థి గెలిచారు. మూడు చోట్ల కాంగ్రెస్​ పార్టీకి చైర్​పర్సన్ ఎన్నికకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ వచ్చింది.  

వికారాబాద్​జిల్లాలోనూ కాంగ్రెస్సే..

వికారాబాద్ : వికారాబాద్​జిల్లాలో వికారాబాద్, కొడంగల్, తాండూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​హవా కొనసాగింది. పరిగిలో మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. వికారాబాద్​లో 34 వార్డులు ఉండగా, రెండు వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్​నుంచి ఒకరు, బీఆర్​ఎస్​నుంచి మరొకరు ఏకగ్రీవమయ్యాయి. 

బీఆర్ఎస్​నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థి కాంగ్రెస్​లో చేరడంతో కాంగ్రెస్​ఇప్పటికే రెండు స్థానాలు గెలుచుకున్నట్టయ్యింది. మిగిలిన 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​16, బీఆర్ఎస్​ 10, బీజేపీ 4, ఎంఐఎం 1, ఇండిపెండెంట్​అభ్యర్థి ఒకరు గెలుపొందారు. 16వ వార్డు నుంచి గెలుపొందిన ఇండిపెండెంట్​అభ్యర్ధి కూడా కాంగ్రెస్​లో చేరారు. 

కొడంగల్​లో 12 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్, ఇండిపెండెంట్​అభ్యర్థులు ఒక్కో వార్డులో విజయం సాధించారు. తాండూరులో 36 వార్డులుండగా, కాంగ్రెస్​ 19, బీఆర్​ఎస్​ 12, బీజేపీ 3, ఎంఐఎం 1,ఇండిపెండెంట్​అభ్యర్థి ఒకరు గెలుపొందారు.   

మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీ 4 స్థానాలను దక్కించుకుంది. మూడుచింతలపల్లిలో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 9, బీజేపీ ఒక చోట విజయం సాధించింది. ఈ రెండు చోట్ల బీఆర్ఎస్​పూర్తి మెజారిటీ దక్కించుకుని చైర్​పర్సన్​స్థానాలను తన ఖాతాలో వేసుకున్నది. 

ఇబ్రహీంపట్నంలో కారు జోరు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులుండగా..13 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్​, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్​విజయం సాధించారు. 7వ వార్డు సీతారాంపేట్​లో 1000 ఓట్లు పోల్​కాగా, కాంగ్రెస్​నుంచి టేకుల కమలాకర్​రెడ్డికి 492 , బీఆర్ఎస్​అభ్యర్థి నుండి టేకుల సుదర్శన్​రెడ్డికి 494, ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 2 ఓట్ల తేడాతో బీఆర్ఎస్​అభ్యర్థి విజయం సాధించారు. 24 వార్డుల్లో పోటీచేసిన కాంగ్రెస్​ కేవలం 20 ఓట్లలోపు తేడాతో ఐదు స్థానాలను కోల్పోయింది. 

1వ వార్డులో బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామలకు 302 ఓట్లు, కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన చింతం రాధమ్మకు 285 ఓట్లు వచ్చాయి. 4వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థి కొండ్రు ప్రవీణ్​కుమార్​ కు 392, కాంగ్రెస్​ అభ్యర్థి యాచారం శ్రీకాంత్​ కు 379 ఓట్లు వచ్చాయి. 19వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థి ఆకుల యాదగిరికి 430, కాంగ్రెస్​ అభ్యర్థి మహ్మద్​ఫెరోజ్​కు 424 ఓట్లు వచ్చాయి. 23 వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థి నీలం శ్వేతకు 370 ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి చెనమోని చంద్రకళ కు 358 ఓట్లు పడ్డాయి. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్​గెలిచి ఉంటే బీఆర్ఎస్​తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉండేది. 

12వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థి కొండిగారి త్రిలోక్​కుమార్​(మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కొడుకు) కాంగ్రెస్​అభ్యర్థిపై100 ఓట్ల తేడాతో గెలిచాడు. ఆమనగల్​ లో 15 వార్డులుండగా...8 బీఆర్​ఎస్​, 6 బీజేపీ, 1 స్థానం కాంగ్రెస్​ గెలుచుకుంది.

మొయినాబాద్​లో ఉత్కంఠ

మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్​ఫిగర్​రాలేదు. ఇక్కడ 26 వార్డులుండగా..10 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఆరుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే ఇండిపెండెంట్లలో ఇద్దరు బీజేపీ రెబల్, మరో ఇద్దరు కాంగ్రెస్​ రెబల్​అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. మ్యాజిక్​ ఫిగర్​కు కాంగ్రెస్​కు నలుగురు అభ్యర్థుల అవసరం ఉంది. దీంతో పార్టీ పెద్దలు ఇండిపెండెంట్లతో మంతనాలు సాగిస్తున్నారు.