పైసలిచ్చినా పనులు ఎందుకు చెయ్యలే :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పైసలిచ్చినా పనులు ఎందుకు చెయ్యలే :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  •  స్కూల్​ ఆవరణలోని ఈ చెత్త ఏంది?  
  • సుల్తాన్​బజార్, ఉస్మాన్ గంజ్​సూళ్లలో అసంపూర్తి పనులపై  కలెక్టర్​ ఫైర్​
  • కాంట్రాక్టర్​కు నిధులివ్వొద్దని ఆదేశం

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  ప్రభుత్వం పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని హైదరాబాద్​ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం సుల్తాన్ బజార్, ఉస్మాన్ గంజ్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన విజిట్​చేశారు. సుల్తాన్ బజార్ లో ఇటీవల  నిర్మించిన స్కూల్​లో  మెరుగైన సదుపాయాలు కల్పించామన్నారు.

దీనిపై బస్తీల్లోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చొరవ తీసుకోవాలన్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల బిల్డింగ్​పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్​ఆవరణలోని చెత్తాచెదారం తొలగించి క్లీన్​గా ఉంచాలని, స్టూడెంట్స్ ఆడుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

తర్వాత ఉస్మాన్ గంజ్ లో ఉన్న గవర్నమెంట్​హైస్కూల్​ను సందర్శించి రెండు విభాగాల్లో ఉన్న  పాత బిల్డింగులను తొలగించి కొత్త బిల్డింగుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  పాఠశాల ఆవరణలో గతంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండడంతో కాంట్రాక్టర్ కు నిధులు చెల్లించవద్దని ఆదేశించారు. డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ఏడీ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షఫీమియా, డీఈ ఆశీర్వాదం, హెచ్ఎంలు మాధురి, విజయలక్ష్మి, శోభ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.