
- అమెరికన్ కంపెనీలు ఇండియాలో తమ జీసీసీలను విస్తరించే అవకాశం
- టెక్ ట్యాలెంట్ నిలుపుకుంటే స్టార్టప్లు భారీగా పెరిగే ఛాన్స్
- పెద్ద మొత్తంలో వీసీలు, ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు ఆకర్షించొచ్చు
- రిమోట్ మోడల్లో ప్రాజెక్టులు డెలివరీ చేస్తే ఐటీ కంపెనీల ఖర్చులు తగ్గిపోతాయి
న్యూఢిల్లీ: యూఎస్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్ల (రూ.88 లక్షల) కు పెంచడంతో తాత్కాలికంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నష్టపోయినా, లాంగ్టెర్మ్లో లాభాలెన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే లోకల్గా ఉద్యోగాలు పెంచొచ్చని, అలానే ఐటీ కంపెనీలు తమ ఎక్స్పోర్ట్స్ మోడల్ను మార్చుకుంటే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు లోకల్గా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) ను విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇండియాలో విస్తరించనున్న జీసీసీలు..
వీసా ఫీజు పెంపుతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ టెక్ కంపెనీలు ఇండియాలోని తమ జీసీసీలను విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచే రిమోట్గా ప్రాజెక్టులకు సపోర్ట్ అందించొచ్చు. దీంతో లోకల్గా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. 2025 నాటికి ఇండియాలో 1,700–1,800 జీసీసీలు ఉన్నాయని అంచనా. ఈ జీసీసీలు సుమారు 19–20 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇంకా ప్రతీ ఏడాది 64.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5.6 లక్షల కోట్ల) ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. వీటిలో అమెరికన్ కంపెనీల వాటా సుమారు 65–70శాతం ఉంటుంది. ఇవి హైదరాబాద్, బెంగళూరు, పూణె, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.
మన టెక్ ట్యాలెంట్ మన దగ్గరనే..
విదేశాలకు వెళ్లే అవకాశాలు తగ్గితే, భారతీయ టెక్ ట్యాలెంట్ దేశంలోనే ఉండి, స్టార్టప్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ), డిజిటల్ ఇండియా వంటి రంగాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో సుమారుగా 1,12,000 టెక్ స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో ఏఐ, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్), ఫిన్టెక్, హెల్త్టెక్, డీప్టెక్ వంటి విభాగాల్లోని చాలా స్టార్టప్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా గుర్తింపు పొందింది.
హెచ్1బీ వీసా ఫీజు పెంపు వల్ల ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ వంటి సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే టెక్ ట్యాలెంట్, స్టార్టప్లలో చేరే అవకాశం పెరుగుతుంది. స్టార్టప్లు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ నైపుణ్యాన్ని పొందగలవు. ఇది ఆర్ అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, స్కేలింగ్ వంటి దశల్లో కీలకంగా ఉంటుంది. ఇంకా క్లౌడ్, సాస్, ఏపీఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్టార్టప్లు అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లకు ఇండియా నుంచే సేవలు అందించగలవు. హెచ్1బీపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
స్టార్టప్లు పెరిగే ఛాన్స్
టెక్ ట్యాలెంట్ ఇండియాలోనే ఉంటే స్టార్టప్ ఫౌండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యం మారి, దేశంలోనే స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన పెరుగుతుంది. ఇది ఇన్నోవేషన్, ఉపాధి, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికి దోహదపడుతుంది. ఇండియాలో ట్యాలెంట్ ఉండడం వల్ల వెంచర్ క్యాపిటలిస్టులు, యాంజెల్ ఇన్వెస్టర్లు దేశీయ స్టార్టప్లపై మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. టెక్ ట్యాలెంట్ విదేశాలకు వెళ్లే అవకాశాలు తగ్గితే, టైర్2, టైర్3 నగరాల్లోనూ స్టార్టప్లు పుట్టుకొస్తాయి.
ఐటీ కంపెనీలు రూట్ మర్చాలి
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇండియన్ టెక్ కంపెనీలు నార్త్ అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి హెచ్1 బీ వీసా ద్వారా మన దగ్గర నుంచి టెక్ ట్యాలెంట్ను తీసుకుపోయి, ప్రాజెక్టులను నడిపిస్తున్నాయి. కానీ, తాజాగా వీసా ఫీజు పెంపు వలన తమ స్ట్రాటజీని మార్చే అవకాశం ఉంది. ఆన్సైట్ (అమెరికా) నుంచే క్లయింట్లకు సర్వీస్లు అందించడం కంటే రిమోట్ డెలివరీ, క్లౌడ్ బేస్డ్ సర్వీస్ల వైపు మారితే, ఇండియా నుంచే సేవలు అందించగలగడం ఈజీ అవుతుంది. ఖర్చులు భారీగా తగ్గుతాయి. క్లౌడ్, సాస్, ఏపీఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ద్వారా రిమోట్ డెలివరీ సాధ్యమవుతుంది. జూమ్, టీమ్స్, వర్చువల్ డెవ్ఆప్స్ ద్వారా కస్టమర్ ఇంటరాక్షన్ ఆన్సైట్లో లేకుండానే నిర్వహించవచ్చు.
మరోవైపు అమెరికాలో స్థానిక ఉద్యోగులను నియమించడాన్ని పెంచుతూ, భారతదేశంలో ఉన్న జీసీసీ ద్వారా కోర్ టెక్, ఆర్ అండ్ డీ, క్యూఏ, సపోర్ట్ సేవలను అందించవచ్చు. దీంతో వీసా ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, స్థిరమైన డెలివరీ మోడల్ను డెవలప్ చేసుకోవచ్చు. జీసీసీలు కూడా భారత టెక్ ట్యాలెంట్ను నిలుపుకొని, ఇన్నోవేషన్స్ను ప్రోత్సహిస్తాయి. అమెరికా వీసా పరిమితుల కారణంగా, కొన్ని కంపెనీలు మెక్సికో, కెనడా, కోస్టారికా వంటి దేశాల్లో నియర్షోర్ సెంటర్లను ఏర్పాటు చేయొచ్చు. యూఎస్ కస్టమర్లకు సమీపంలో సేవలు అందించగలగడం వల్ల, ఆన్సైట్ అవసరం తగ్గుతుంది.
తాత్కాలికంగా ఇబ్బందే
భారతీయ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తూ తమ ఆదాయాన్ని ఇండియాకు పంపడం ద్వారా రెమిటెన్స్ రూపంలో దేశానికి విదేశీ కరెన్సీ లభిస్తోంది. హెచ్1బీ వీసా ఖర్చు పెరగడం వల్ల విదేశీ ఉద్యోగ అవకాశాలు తగ్గితే, ఈ రెమిటెన్స్ ప్రవాహం తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గితే, ఇండియాలోనే ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతుంది. దీని వల్ల స్థానికంగా జాబ్స్ కోసం ఒత్తిడి పెరగొచ్చు. అయితే దీన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటే, దేశీయ పరిశ్రమలు స్థానిక ట్యాలెంట్ను మెరుగ్గా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒక్కో ఉద్యోగి కోసం జరిపే వీసా ఖర్చు పెరగడం వల్ల ప్రాజెక్ట్ మార్జిన్లు తగ్గుతాయి. ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్-సైజ్ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వీసా ఖర్చు అధికంగా ఉన్నందున, కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించేందుకు మొగ్గు చూపొచ్చు. దీని వల్ల భారతీయ ఉద్యోగులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ చర్యలతో అమెరికాలో టెక్ ట్యాలెంట్ తగ్గిపోతుంది. టెక్ ఇన్నోవేషన్లు తగ్గిపోతాయనడంలో సందేహం లేదు.