అమ్మాయిల ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టి … కాల్ గర్ల్స్గా చిత్రీకరించడమే కాకుండా , అమాయక యువకుల నుండి డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు… అంబర్ పేట్ లో నివాసం ఉండే రుచిత (21), అదే ప్రాంతానికి చెందిన మనికేత్ రెడ్డి (25) లు 2018 నుండి సహజీవనం చేస్తున్నారు. అంబర్ పేట్ లో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఏడాది వరకు రుచితతో సరదాగా గడిపిన మనికేత్ రెడ్డి.. రెండు నెలల క్రితం ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. దీనితో ఆ యువతి తన ‘భర్త కనిపించడం లేదంటూ’ అంబర్ పేట్ పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న అంబర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మనికేత్ రెడ్డి తో ఉన్నప్పుడు తరుచూ మొబైల్ నంబర్లు మారుస్తూ ఉండటంతో… ఆ నెంబర్ లను సోషల్ మీడియాలో సర్చ్ చేసింది రుచిత. ఆ నెంబర్ల పై పలువురు మహిళల పేర్లతో ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లు ప్రత్యక్షమయ్యాయి. ఆ అకౌంట్లలో ఇంటర్ నెట్ నుండి సేకరించిన మహిళల ఫోటోలతో పాటు, రుచిత ఫొటో, ఆమె స్నేహితురాలి ఫోటో కూడా ఉండటంతో ఖంగుతిన్నది. యువకులను రెచ్చగొట్టేలా ఆ ఫోటోలతో మనికేత్ రెడ్డి పోస్టులు పెట్టాడని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గురువారం యువతి చేసిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు మనికేత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో.. అతని పోస్టులకు ఆకర్షితులైన యువకుల దగ్గర నుంచి గూగుల్ పే ద్వారా మనికేత్ రెడ్డి డబ్బులు గుంజేవాడని తెలిసింది. అలా ఒకసారి డబ్బులు పంపిన వ్యక్తుల నెంబర్ లను అతను బ్లాక్ చేసేవాడిని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. రుచిత , ఆమె స్నేహితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులతో మనికేత్ రెడ్డి పై కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు.