
- ఐదుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు : కాంబోడియాలోని సైబర్ నేరగాళ్లకు సిమ్కార్డులు సప్లై చేస్తున్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1,748 ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులు, ఏడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సూర వెంకటేశ్ బీటెక్ పూర్తి చేసి బెంగళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. 2022లో ఉద్యోగం వదిలేసి నిమ్మకాయల వ్యాపారం చేసి నష్టపోయాడు.
అనంతరం సైబర్ నేరగాళ్లకు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సప్లై చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా కడప జిల్లా బద్వేల్లోని ఎయిర్టెల్ సిమ్ కార్డుల డిస్ట్రిబ్యూటర్, ఆర్ఎస్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు సద్దాం హుస్సేన్ను సంప్రదించాడు. కస్టమర్ల ఐడీ ప్రూఫ్స్తో యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను ఒక్కో కార్డుకు రూ. 400 చెల్లించి సుమారు 2000 కార్డులు కొనుగోలు చేశాడు. వీటిని గూడూరుకు చెందిన దానం విజయ్కుమార్, తిరుపతి సంగనపల్లికి చెందిన గోడ్తల గోవర్దన్తో కలిసి చెన్నైకి చెందిన బాలకృష్ణన్ మణికందన్కు సప్లై చేసేవాడు.
ఇందుకోసం ఒక్కో సిమ్కార్డుకు రూ. 800 తీసుకునేవాడు. ఆ సిమ్లను బాలకృష్ణన్ కాంబోడియాలో కాల్సెంటర్ నిర్వహిస్తున్న తంజావూర్కు చెందిన రాజేశ్కు సప్లై చేసేవాడు. అతడు వీటిని సైబర్ నేరగాళ్లకు అమ్ముకునేవాడు. వారు ఆ సిమ్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడేవారు. ఇటీవలి కాలంలో నమోదైన కేసుల ఆధారంగా టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సప్లై చేస్తున్న వెంకటేశ్తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.