
- వెసెక్టమీ చేయించుకున్న కర్నల్తో గర్భం ఎలా వస్తుందని ప్రశ్నించిన బెంచ్
- సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిలైందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అత్యాచార కేసులో హైదరాబాద్ శామీర్పేట డీఆర్డీఓ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కర్నల్ రిషి శర్మకు కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగారశిక్షను హైకోర్టు రద్దు చేసింది. పరిస్థితుల ఆధారంగా కేసు నిరూపణకు అవసరమైన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. సందేహాలకు అతీతంగా కేసును రుజువు చేయకలేకపోయిందని తెలిపింది. కీలక సాక్షుల వాంగ్మూలాలకు పొంతన లేదని, అప్పీలుదారుకు మద్దతుగా నిలిచే డాక్యుమెంటరీ ఆధారాలను ప్రాసిక్యూషన్ విస్మరించిందని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. సుప్రీంకోర్టు పలు కేసుల్లో వెలువరించిన తీర్పులకు భిన్నంగా కింది కోర్టు తీర్పు ఉందని పేర్కొంది.
అప్పీలుదారు కర్నల్ రిషి శర్మపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసింది. రిషి శర్మను నిర్దోషిగా ప్రకటించింది. కాగా.. ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 2017 ఏప్రిల్ 25న కల్నల్ రిషి శర్మపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ సెప్టెంబరు 2024లో కింది కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రిషిశర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అప్పీల్ పై న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ పూర్తి చేసి ఇటీవల తీర్పు వెలువరించింది.
‘‘ఫిర్యాదు చేసిన మహిళ 2017 ఏప్రిల్ 17న గర్భం దాల్చినట్లు తేలితే ఏప్రిల్ 25 వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో సరైన కారణాలు పేర్కొనలేదు. అబార్షన్ చేసుకున్నప్పటికీ వైద్యపరమైన విధానంపై మెడికల్ రిపోర్టులు ఏవీ లేవు. అబార్షన్ చేయించుకున్నాక పిండం సాంపిల్స్ తీసుకుని డీఎన్ఏ పరీక్ష నిర్వహించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. అప్పీలుదారు కర్నల్ రిషి శర్మ 2005లో వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నపుడు అతని వల్ల గర్భం వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి కింది కోర్టు తీర్పును రద్దు చేస్తున్నాం” అని బెంచ్ తెలిపింది.
దర్యాప్తు ఆఫీసర్ల ప్రమాణాలు పెరగాలి
‘‘దర్యాప్తు అధికారులు ప్రమాణాలు పెంపొందించాలి. దర్యాప్తు నాణ్యత పర్యవేక్షణకు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని వెలువరించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే నేర న్యాయవ్యవస్థ పారదర్శకతతోపాటు ప్రజల్లోనూ విశ్వాసం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నిజంగా నష్టపోతున్నది నేర న్యాయపాలనే. దీనికితోడు నిర్దోషిని శిక్షించి నిజమైన దోషులను వదిలివేయడం జరుగుతోంది. కాబట్టి దర్యాప్తు సంస్థ నైపుణ్యాలు పెంపొందించుకోచాలి. ఫోరెన్సిక్ పద్ధతులు, చట్టపరమైన విధానాలకు శిక్షణ కూడా అవసరం” అని జస్టిస్ తుకారాంజీ వేరుగా రాసిన తీర్పులో పేర్కొన్నారు.