
- ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సందర్భంగా లెక్కలు విడుదల
- టాప్ సేల్స్ కలిగిన బ్రేక్ఫాస్ట్గా మసాలా దోశ
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ఒక ఇడ్లీ లవర్ స్విగ్గీలో తెగ ఆర్డర్లు ఇచ్చాడట. వాటి లెక్క ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. కేవలం ఒకే ఒక ఏడాది వ్యవధిలో అతడు రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీల కోసం ఆర్డర్స్ పెట్టాడట. ఈవిషయాన్ని స్విగ్గీ కంపెనీ గురువారం వెల్లడించింది. ఆ ప్రియమైన కస్టమర్ ఏడాది టైంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలు కొన్నాడని తెలిపింది. అతగాడు హైదరాబాద్దాటి బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లినప్పుడు కూడా ఇడ్లీ కోసం ఆర్డర్స్ పెట్టడం ఆపలేదనిపేర్కొంది.
మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ఈవివరాలను విడుదల చేశామని స్విగ్గీ తెలిపింది. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా స్విగ్గీ ద్వారా ఫుడ్ లవర్స్ ఇచ్చిన ఇడ్లీ ఆర్డర్లను విశ్లేషించి ఈ ఆసక్తికర గణాంకాలను గుర్తించినట్లు వెల్లడించింది. గత 12 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీ కోసం స్విగ్గీలో ఆర్డర్స్ వచ్చాయని వివరించింది. దీన్నిబట్టి ఇడ్లీకి ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఇడ్లీ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్న టాప్–3 సిటీస్ జాబితాలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయని తెలిపింది. వాటి తర్వాతి స్థానాల్లో ముంబై, కోయంబత్తూర్, పుణె, వైజాగ్, ఢిల్లీ, కోల్కతా, కొచ్చి ఉన్నాయని పేర్కొంది.
ప్రధానంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య టైంలోనే ఇడ్లీల కోసం ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. చెన్నై, హైదరాబాద్,బెంగళూరు, కోయంబత్తూర్, ముంబైలలోనైతే డిన్నర్ టైంలోనూ ఇడ్లీ కోసం ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో నెయ్యి ఇడ్లీని, బెంగళూరులో రవ్వ ఇడ్లీని ఫుడ్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొంది. స్విగ్గీలో బ్రేక్ ఫాస్ట్ కేటగిరీలో అత్యధిక ఆర్డర్స్ మసాలా దోశకు వస్తుండగా.. దాని తర్వాతి స్థానంలో ఇడ్లీయే ఉందని స్విగ్గీ స్పష్టంచేసింది. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్, ఉడిపీస్ఉపహార్లు ఇడ్లీల కోసం ఫేమస్ అని వెల్లడించింది.